
జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలి
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నగర కమిటీ అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర రద్దుచేసిన 44 కార్మిక చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే పునురుద్ధరించాలని కోరారు. నిత్యం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు అరికట్టాలని, ఇందుకు రక్షణ చట్టం తేవాలన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హుస్సేన్, వీడియో జర్నలిస్టు రాష్ట్ర నాయకులు హుస్సేన్, జిల్లా నాయకులు సునీల్కుమార్, నగర కార్యదర్శి ఎర్రమల పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన