
సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా రాధిక
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా బి.రాధికను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు, డీఎస్డబ్ల్యూఓలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న రాధికను ఇక్కడకు బదిలీ చేశారు. రెండు నెలల క్రితం ఇక్కడ రెగ్యులర్ జేడీగా విధులు నిర్వహించిన జె.రంగలక్ష్మిదేవి అమరావతి డైరెక్టరేట్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు వచ్చారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
ఆలూరు: ఆలూరు మూడో సచివాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ ఎంపీడీఓ, ఆలూరు ఈఓ వై.ప్రభాకర్రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు సకాలంలో హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వారికి నో టీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పని సరిగా 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని లేదంటే జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
గురుకులాల్లో
సీటు ఖరారు చేసుకోండి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు వెంటనే తమ సీటు ఖరారు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి కోరారు. ఇటీవల నిర్వహించిన 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన వారికి ఎంపిక ప్రక్రియ జరుగుతోందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని డీసీఓ కోరారు. మొదటి జాబితాలో అర్హత పొందిన వారు వెంటనే ప్రవేశం పొందాలని, లేనిపక్షంలో వారికి ప్రవేశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాను వెంటనే విడుదల చేస్తామన్నారు.
రూ.1.18 లక్షల విరాళం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిమళ విద్యానికేతన్కు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన దివిజ హన్విక అనే భక్తురాలు రూ. 1.18 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆమెకు శేష వస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు.
ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 8న పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. మెరిట్ కార్డులు www. bse.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి విద్యార్థి ఆధార్ను లింక్ చేయించి డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.