
‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు
వైఎస్సార్సీపీ పాలనలో
పూర్తయిన పనులు
ప్యాకేజీ పూర్తయిన అంచనా మొత్తం
నెంబర్ పనులు (రూ.లక్షల్లో)
40 23 రూ.3,663.60
41 35 రూ.4,333.99
42 10 రూ.1,851.33
43 06 రూ.596.03
44ఏ 01 రూ.1,503.74
44సీ 01 రూ.870.10
మొత్తం 76 రూ.12,818.79
గత ప్రభుత్వంలో రూ.295.64 కోట్లతో ప్రారంభం
● 139 పనుల్లో ఏడాది క్రితమే 76 పూర్తి
● మిగిలిన పనులు పూర్తి చేయని
కూటమి ప్రభుత్వం
● సేఫర్ స్టేజ్ ముసుగులో కాలయాపన
● రూ.196 కోట్ల పనులను
రూ.51 కోట్లకు కుదింపు
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు(ఏపీఆర్ఆర్పీ) కింద చేపట్టిన గ్రామీణ రోడ్ల పనుల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఈ పనులను పూర్తి చేయలేక, ‘సేఫర్ స్టేజ్’ పేరిట కాలయాపన చేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలో రూ.295.64 కోట్లతో 19 ప్యాకేజీల్లో 139 పనులను చేపట్టారు. ఇందులో 329.77 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, పలు బ్రిడ్జీలు నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మొత్తం పనుల్లో రూ.12,818.79 లక్షల అంచనాతో రూపొందించిన 76 పనులు పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి అప్పట్లోనే రూ.5,946.79 లక్షల బిల్లులను కూడా చెల్లించారు. ఇంకా చేసిన పనులకు సంబంధించి రూ.2,761.48 లక్షల బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ బిల్లులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన 63 పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనులను పూర్తి చేయలేక ‘సేఫర్ స్టేజ్’ పేరిట పలు కారణాల వల్ల ప్రారంభం కాని పనులను నిలుపుదల చేస్తూ, పురోగతిలో ఉండి ఆగిపోయిన పనులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మాత్రమే చేపట్టేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.19,695.32 లక్షలతో పూర్తి చేయాల్సిన పనులను రూ.5,164.98 లక్షలకు కుదించి ప్రతిపాదనలు పంపారు. అయితే నెల రోజులు కావస్తున్నా ఈ పనులకు కూడా ఆమోదం లభించని పరిస్థితి నెలకొంది.
రద్దయిన 29 పనులు
ఏపీఆర్ఆర్పీ గ్రాంట్ కింద మంజూరై, వివిధ కారణాల వల్ల ప్రారంభం కాని పనులను సేఫర్ స్టేజ్లో రద్దు చేశారు. మొత్తం ఏడు ప్యాకేజీల్లో రూ.3,888.83 లక్షల విలువైన 29 పనులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే పురోగతిలో ఉన్న బిలో గ్రావెల్ సబ్ బేస్ కింద ఉన్న 9 పనులను సేఫ్ క్లోజింగ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.
పల్లె పండుగ బిల్లులకు గ్రహణం
పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రూ.150.04 కోట్లతో 1,916 పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.23.75 కోట్లు మాత్రమే విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ 14న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అంతర్గత రోడ్ల నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శరవేగంగా పనులను పూర్తి చేశారు. అయితే ఐదు నెలలు గడచినా బిల్లులు విడుదల చేయకపోవడం గమనార్హం.
రూ.51.64 కోట్లతో ప్రతిపాదనలు
ఏపీఆర్ఆర్పీ పనులను సేఫర్ స్టేజ్లో పూర్తి చేసేందుకు ఈఎన్సీ ఆదేశాల మేరకు రూ.51.64 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం లభించిన వెంటనే ఆరు ప్యాకేజీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపడతాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా పూర్తి చేసిన పనులకు బిల్లులు మరో పదిహేను రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. – వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ

‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు

‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు

‘దారి’న పడని ఏపీఆర్ఆర్పీ పనులు