
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
కర్నూలు: ఆదోని వాల్మీకి నగర్లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదోని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.91 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు గత నెల 18న క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి నాగరాజును అదుపులోకి తీసుకోగా మిగిలిన ఆరుగురు పారిపోయారు. సాంకేతికత ఆధారంగా మిగిలిన ఆరుగురిని కర్నూలు, హైదరాబాద్, ఒంగోలు, చిలకలూరిపేట, బెంగళూరు సిటీ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నాగరాజుతో పాటు ఆదోని పట్టణానికి చెందిన మసీదుపుర ఇస్మాయిల్ అలియాస్ ఇస్మాయిల్, బోయ మహానంది, బోయ రమేష్, బెంగళూరు సిటీకి చెందిన ఎస్.రాజేష్, ఒంగోలు పట్టణానికి చెందిన అడ్డాల కళ్యాణ్, హైదరాబాద్కు చెందిన రఘు ఆచారి తదితరులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్తో కలసి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నేషనల్ ఎక్సేంజ్ 9, రాధే ఎక్సేంజ్, వజ్రా ఎక్సేంజ్, నేషనల్ 777, మోర్ ఎక్సేంజ్ తదితర క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో వీరు బెట్టింగ్ నిర్వహించినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ను ఆన్లైన్లో ఆడుతూ డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారని ఎస్పీ అన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారన్నారు. బెట్టింగ్ను ఎలాగైనా అరికట్టాలని గత నేర సమీక్ష సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు గట్టిగా ఆదేశించినట్లు తెలిపారు. సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరచిన ఆదోని డీఎస్పీ హేమలత, సీఐ శ్రీరామ్తో పాటు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మునుస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుసేన్ బాషాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
రూ.91 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు సీజ్
వివరాలు వెల్లడించిన
ఎస్పీ విక్రాంత్ పాటిల్