
రికార్డులు పరిశీలిస్తున్న డీఐఓ ప్రవీణ్కుమార్
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ చెప్పారు. సోమవారం ఆయన నగరంలోని ఇల్లూరు నగర్లో ఉన్న యూపీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, పిల్లలకు సమయానుసారంగా ఇవ్వాల్సిన టీకాలు ఏదైనా కారణం వల్ల ఇవ్వనట్లయితే డ్యూ లిస్ట్ తయారు చేసుకుని వారికి మూడవ విడతలో భాగంగా 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో టీకాలు వేయించాలన్నారు. ఆ వివరాలను యువిన్, ఆర్సీహెచ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. న్యుమోనియా లక్షణాలున్న పిల్లలను పరిశీలించి వారికి మెరుగైన వైద్యం కోసం సమీపంలోని సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాలని సూచించారు.