స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ | - | Sakshi
Sakshi News home page

స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ

Jan 3 2026 8:07 AM | Updated on Jan 3 2026 8:07 AM

స్మృత

స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ

స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ

గత ప్రభుత్వంలో.. బెజవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ఏడాదిన్నరగా పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌ ఆడిటోరియంతో పాటు అసంపూర్తిగా పనులు తగ్గుతున్న పర్యాటకుల సంఖ్య

వెలవెల..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రానికే తలమానికంగా విజయవాడలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంబేడ్కర్‌ స్మృతి వనంపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం నీడ పడుతోంది. దీని నిర్వహణను వదిలేసి.. పెండింగ్‌ పనులు పూర్తి చేయకుండా కాలం గడుపుతోంది. గతంలో సందర్శకులతో కళకళలాడిన స్మృతి వనం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో నామ మాత్రంగా ప్రభుత్వం ఎంట్రీకి రూ.5 టిక్కెట్‌ ధరను నిర్ణయించింది. దీంతో నెలకు సుమారు రూ. 3 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి ఉంది.

నిర్వహణ ఏదీ

మొదట్లో అంబేడ్కర్‌ స్మృతి వనం నిర్వహణను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చూసేది. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి రాగానే నిర్వహణను చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. పైగా ఓ ప్రైవేటు సంస్థ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆ ప్రాంగణంలో గ్రీనరి పూర్తిగా దెబ్బతింది. అక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వహణ భారం అంటూ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు యత్నించింది. వైఎస్సార్‌ సీపీతో పాటు, ప్రజా సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్ప జెప్పింది. కొంత మేర ఉద్యోగులకు జీతాలు చెల్లించారు. నిర్వహణ బకాయిలు రూ.1.5కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. స్మృతివనం నిర్వహణతో పాటు, కొంతమేర పెండింగ్‌ పనులు చేయడానికి సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటున్నా నిధుల లేమి పట్టి పీడిస్తోంది.

గత ప్రభుత్వంలో ..

గత ప్రభుత్వ హయంలో నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేలా అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని తీర్చి దిద్దారు. మొదటి దశలో 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఆ ప్రాంగణాన్ని గ్రీనరీతో ముస్తాబు చేశారు. కారిడార్‌ మొత్తం గ్రానైట్‌ ఫుట్‌పాత్‌, ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్‌ చేశారు. ప్రత్యేక లైటింగ్‌ సిస్టం ఏర్పాటుతో పాటు అందంగా గార్డెన్‌ రూపొందించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి అద్భుతంగా రూపొందిండానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. అరుదైన భారతరత్న బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయ శిల్పం పనులు 2022 మార్చి 21న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 జనవరి 19 తేదీన ఆవిష్కరించారు. నాటి ప్రభుత్వంలో జనకళతో సందడిగా కనిపించిన ఆ ప్రాంగణం చంద్రబాబు పాలనలో కళావిహీనంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అంబ్కేడర్‌ విగ్రహం ప్రాంగణంలో ఏసీలు పని చేయడం లేదు. పైన రెండవ గ్యాలరీ పనులు ప్రారంభం కాలేదు.అంబేడ్కర్‌ విగ్రహం వెనుక రాతిని అతికించే పనులను నిలిపివేశారు. ప్రాంగణంలో ఫౌంటెన్లు పని చేయడం లేదు. 70 మంది సామర్థ్యంతో నిర్మించిన మిని థియేటర్‌ వినియోగంలోకి తీసుకురావడం లేదు. రెండో దశలో పెండింగ్‌ పనులు ఏ ఒక్కటి పూర్తి కాలేదు. ప్రస్తుతం కేవలం 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 మంది సామర్థ్యంతో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు మాత్రమే జరుగుతున్నాయి. పుడ్‌కోర్టు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సింది. ఆడిటోరియం, మ్యూజియం, లిఫ్ట్‌లు బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలను, చిల్డ్రన్‌ పార్కు, మినీ ఽథియేటర్లు వంటి పనులు ప్రారంభమే కాలేదు.

స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ 1
1/1

స్మృతి వనంపై నిర్లక్ష్యం నీడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement