సహకార రంగంతో సాధికారత సాధ్యం
చల్లపల్లి: సహకార రంగంతో యువత, మహిళలు, బలహీనవర్గాల సాధికారత సాధ్యమవుతుందని కృష్ణాజిల్లా సహకార అధికారి కె.చంద్రశేఖరరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పురిటిగడ్డ పీఏసీఎస్లో మంగళవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను నిర్వహించారు. తొలుత చల్లపల్లి పీఏసీఎస్ సీఈఓ తోట కృష్ణారావు వందన సమర్పణ చేయగా సహకార అధికారి చంద్రశేఖరరెడ్డి సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ విద్యాధికారి కె.బి.రంగరాజు సహకార పతాక గేయాన్ని ఆలపించారు.
సహకార ఉద్యమంలో యువశక్తి పాల్గొనాలి..
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత సహకార వ్యవస్థ పెద్దదన్నారు. 8,45.475 సహకార సంఘాలతో, 32 కోట్లకు పైగా సభ్యులతో, 30 రకాల సెక్టార్లతో కొనసాగుతున్న సహకార ఉద్యమంలో యువశక్తి పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మచిలీపట్నం విభాగ సహకార అధికారి వి.వి.ఫణికుమార్ ఆత్మ నిర్భర భారత్, సహకార్ సమృద్ధి పథకాల గురించి, వారోత్సవాల ప్రాధాన్యతను రంగరాజు వివరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. పురిటిగడ్డ పీఏసీఎస్ చైర్మన్ పెద్దిబోయిన హరినాథ్ అధ్యక్షతన జరిగిన సభలో కేడీసీసీ చల్లపల్లి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వై.నగరాజకుమారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మహ్మద్ గౌస్, పీఏసీఎస్ల చైర్మన్లు గుత్తికొండ ప్రసాద్, అర్జా రాధిక, నాదెళ్ల శరశ్చంద్రబాబు, రావి శ్రీనివాసరావు, బళ్లా సీతారామప్రసాద్, బ్యాంక్ సూపర్వైజర్లు వినయ కుమార్, సత్యనారాయణలు, అవనిగడ్డ నియోజకవర్గంలోని పీఏసీఎస్ల సీఈఓలు పాల్గొన్నారు.


