కృష్ణా జిల్లాలో పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో పరిస్థితి

Jul 30 2025 7:10 AM | Updated on Jul 30 2025 7:10 AM

కృష్ణ

కృష్ణా జిల్లాలో పరిస్థితి

బస్సు సదుపాయం లేని గ్రామాలు 197
ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత
హైయర్‌ బస్సులు 133
అందుబాటులో ఉన్న బస్సులు 414

చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది. ఆ హామీ ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారా? ఎప్పుడు ఉచిత ప్రయాణం చేద్దామా? అని మహిళలు ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఉచిత బస్సు ప్రయాణం ఇదిగో అదిగో అంటూ హామీ అమలు చేయకుండా ఊరిస్తూ వస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈసారైన అమలు చేస్తారా? మరో వాయిదా వేస్తారా? అంటూ మహిళలు చర్చించుకుంటున్నారు.

రకరకాల ఊహాగానాలు..

చేతి వృత్తులు, చిరువ్యాపారాలు చేసుకునే వారు.. జీవనోపాధికి ప్రతి రోజు ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళా కార్మికులు ఉచిత ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకే పరిమితం చేస్తారా? రాష్ట్ర నలుమూలలు ఉచిత ప్రయాణం చేయెచ్చా? అనే దానిపై స్పష్టత లేకపోవడం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. జిల్లాకే పరిమితం అని, అది కూడా కొన్ని సర్వీసులకేనని లీకులు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలకు సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి ఇదీ..

● కృష్ణా జిల్లాలో మొత్తం 5 డిపోలు, 17 బస్‌ స్టేషన్‌లు ఉన్నాయి. వీటిలో మొత్తం 414 బస్సులు ఉండగా.. వీటిలో 281 ఆర్టీసీ, 133 హైయర్‌ బస్సులు ఉన్నాయి.

● పల్లె వెలుగుకు సంబంధించి 88 ఆర్టీసీ, 74 అద్దె బస్సులు ఉండగా, అల్ట్రా పల్లెవెలుగుకు సంబంధించి ఎనిమిది, 18 అద్దె బస్సులు ఉన్నాయి.

● సిటీ ఆర్డినరీ 76 ఆర్టీసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 11 ఆర్టీసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 22 ఆర్టీసీ, 19 హైయర్‌ బస్సులు ఉన్నాయి.

● జిల్లాలో 8.70లక్షల మంది మహిళలు ఉన్నారు. సగటున రోజుకు లక్ష మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటారని అంచనా.

● ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఈ ప్రయాణించే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

● ప్రస్తుతం 60శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంది. ఇది అమాంతం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

● అయితే అందుకు తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించనుంది.

● ప్రధాన రూట్లలో తప్ప గ్రామీణ ప్రాంతాలకు పల్లె వెలుగు సర్వీసులే దిక్కు.

● బందరు అర్బన్‌లో సిటీ ఆర్డినరీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

197 గ్రామాలకు వెళ్లని ఆర్టీసీ బస్సులు..

జిల్లాలో మొత్తం 497పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ కేవలం 300 గ్రామాలకు మాత్రమే బస్సులు నడుపుతోంది. మిగిలిన గ్రామాల్లో ఆటోల ద్వారానే ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడితే ఈ గ్రామాల్లోని మహిళల పరిస్థితి ఏమిటని? తాము వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలకు ఏ విధంగా ఈ పథకం ద్వారా తోడ్పాటును అందిస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని మహిళలు కోరుతున్నారు.

మొత్తం మహిళలు

8.70

లక్షల మంది

మొత్తం

డిపోలు

5

బస్‌

స్టేషన్లు

17

ఇందులో

ఆర్టీసీవి

281

కండిషన్‌ అంతంత మాత్రం..

జిల్లాలో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని బస్సులు సరైన కండిషన్‌లో లేవు. ఈవీ బస్సులు వస్తాయని చెబుతున్నా.. అసలు ఉచిత ప్రయాణం ఉంటుందా? ఉంటే ఈవీ బస్సుల్లోనూ ఆ సౌకర్యం కల్పిస్తారా? అన్న సందేహాలు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కూడా ప్రభుత్వం మహిళలకు కార్డు జారీ చేస్తుందా? ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రయాణానికి అనుమతిస్తారా? వేచి చూడాలని, అమలు జరిగితే ప్రత్యేక ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోందంటున్నారు.

కృష్ణా జిల్లాలో పరిస్థితి1
1/1

కృష్ణా జిల్లాలో పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement