
కక్షపూరిత విధ్వంసం
మచిలీపట్నంటౌన్: కూటమి ఏడాది పాలనలో బందరులో అభివృద్ధి ఏమోగానీ కక్షసాధింపు చర్యలు, పేదల ఇళ్లు, బడ్డీకొట్లు కూల్చటం, టార్గెటెడ్గా అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలకే పాలకులు ప్రాధాన్యమిచ్చారు. నగరంలో మట్టి మాఫియా అడ్డగోలు దోపిడీని కొనసాగిస్తోంది. మండల పరిధిలోని కూటమి నాయకులు మంత్రి కొల్లు రవీంద్ర ఆశీస్సులతో అందినకాడికి దోచుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. రెవెన్యూ, పోలీస్, కార్పొరేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారులనే పాలకులు ఆయుధాలుగా చేసుకుని వారి కక్షపూరిత పాలనను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముంపు సమస్య తీరేదెప్పుడో?
బందరులో ముంపు సమస్య పరిష్కారానికి పక్కా డ్రెయిన్లను నిర్మిస్తామని పాలకులు ఇచ్చిన హామీని బూచిగా చూపి నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్ల మార్జిన్లో ఉన్న బడ్డీలను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. అలాగే ఎస్బీఐ మెయిన్బ్రాంచ్ వెనుక రోడ్డులో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సైతం మంత్రి కక్ష సాధింపుతో తొలగించారు. అయితే డ్రెయిన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఏడాది కాలంలో ఒక్క పైసాకూడా తేలేదు.
మన వాళ్లకే అంతా..
నగర పాలక సంస్థలో వైఎస్సార్ సీపీ పాలకవర్గం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర ఎంఎంసీ పాలనను తన చేతులోకి తీసుకుని అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు పనులు చేయొద్దని కమిషనర్ను ఆదేశించటంతో ఆయన ఏకపక్షంగా పని చేసుకుంటూ పోతున్నారు. వీధి దీపాల నిర్వహణ కూడా టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ నిర్వహిస్తూ డివిజన్లలో వీధిదీపాలు వెలగకపోయినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బిల్లులు చేయించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేసులతో కక్షసాధింపు..
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్నినాని కుటుంబంపై కక్ష సాధింపుతో మంత్రి కొల్లు రవీంద్ర పావుల కదుపుతున్నారు. గోడౌన్లో సిబ్బంది తప్పిదానికి ఆయన సతీమణిపై కేసులు బనాయించారు. తాజాగా అక్రమ ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ఆయన కుమారుడిపై కేసులు పెట్టే కుటిల యత్నాలను నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
కుమ్మరిగూడెంలో పేదలు నిర్మించుకున్న 200 గృహాలను ఒకేరోజు నేలమట్టం చేసిన పాలకులు(ఫైల్)
బందరులో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా పేదల ఇళ్లను కూల్చిన కూటమి పెద్దలు ఫుడ్కోర్టు, పేదల బడ్డీలు తొలగింపు పేర్నినాని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు
కక్షసాధింపుతో ఉద్యోగుల తొలగింపు..
కూటమి పాలనలో ఎంఎంసీ పరిధిలో పని చేస్తున్న పలు విభాగాల సిబ్బందిని, కార్మికులను వైఎస్సార్ సీపీకి అనుకూలం అనే ముద్ర వేసి తొలగించారు. కూటమి నాయకుల ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ వీరిని తొలగించి వీరి స్థానంలో కూటమి నాయకుల సిఫార్సులతో కొత్తవారిని నియమించారు. ఎంఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లను, మెప్మా విభాగంలో పని చేస్తున్న దాదాపు 15 మంది ఆర్పీలను, దాదాపు 15 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. నోరు తెరిస్తే చాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంతా విధ్వంసం జరిగిందని విమర్శించే కూటమి పాలకులు ఈ ఏడాది కాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన పాలనను ఏమనాలో వారే బదులిస్తే బావుంటుందని ప్రజలు కోరుతున్నారు.
పనులన్నీ కీలకనేత బినామీకే..
నగరపాలకసంస్థలో పనులన్నీంటినీ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర బినామీగా విమర్శలెదుర్కొంటున్న కన్నా ప్రసాద్ అనే కాంట్రాక్టర్తో నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నది నిజమా.. కాదా? అని ఇటీవల మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. రూ. 5లక్షల కన్నా పైబడిన పనులకు పాలకవర్గం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కమిషనర్ బాపిరాజు ఎంఎంసీ జనరల్ ఫండ్ నిధులతో ఏ పనినైనా రూ. 4 నుంచి రూ. 4.50లక్షలుగా విభజించి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్ కన్నా ప్రసాద్తో చేయిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి.