
అవగాహన లేకుండా చర్యలొద్దు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో చాలా మంది అధికారులు అవగాహన లోపంతో అర్జీల పరిష్కారం తప్పుగా చేస్తున్నారని, ఇకనైనా దానిని సరిదిద్దుకుని సరైన పద్ధతిలో వాటిని పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ పి. సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినీ సింగ్, ఆర్డీవో కె. స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వ పాలసీ ప్రకారం త్వరలో మంజూరవుతుందని చెప్పటంతో పాటు పరిష్కార పోర్టల్లో లబ్ధి పొందినట్లుగా చెబుతున్నారని ఇది చాలా తప్పన్నారు. అర్జీదారులు పరిష్కారం పొందకుండానే పరిష్కారం పొందినట్లు చూపటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కాకుండా త్వరలోనే లబ్ధి పొందుతారని సమాధానం ఇవ్వాలన్నారు. సంబంధిత అధికారి అర్జీదారులతో తప్పనిసరిగా మర్యాదగా మాట్లాడి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో మొత్తం 133 అర్జీలను స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన మత్తి కృష్ణారావు తన పొలం రీ–సర్వే నంబర్ 605–1, 22–1లోని 17 సెంట్లు, భార్యకు సంబంధించిన ఏడు సెంట్లను కృష్ణానది కరకట్ట వెడల్పు చేసి రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే తనకు రావాల్సిన నష్టపరిహారం సరిహద్దు రైతులకు ఇచ్చారని అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు.
●జిల్లా పరిధిలోని బుడమేరు చంద్రయ్య డ్రెయిన్, ఐనంపూడి తదితర డ్రెయిన్లలో పూడిక తీయించాలని కొన్నేళ్లుగా ఈ డ్రెయిన్లలో పూడికతీయకపోవటం వల్ల తుపాను సంభవించినప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు వివిధ దశల్లో ఉన్న పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. అలాగే ఆరుగాలం పండించిన పంటకు రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారు.
●చల్లపల్లి మండలం తాలిపేట గ్రామానికి చెందిన తప్పిరి సుబ్బారావు దివ్యాంగుడు. కాగా తనకు మూడు చక్రాల వాహనం లేదని ఇతరుల వాహనంలో వచ్చానని, తనకు బ్యాటరీ మూడు చక్రాల సైకిల్ను ఇప్పించాలని కలెక్టర్కు విన్నవించుకున్నారు. వికలాంగుల సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే బ్యాటరీ వాహనాన్ని ఆ దివ్యాంగుడికి కలెక్టర్ అందజేశారు.
సరైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ బాలాజీ మీ కోసంలో ప్రజల నుంచి 133 అర్జీలు స్వీకరణ