
స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి చర్యలు
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి అంశాలు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం జూన్ 14 నాటికి మార్పులు, చేర్పులు చేపట్టిన అనంతరం జిల్లాలో 15,41,283 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో 7,46,647మంది పురుషులు, 7,94,586 మంది మహిళలు, 50 మంది ఇతరులు ఉన్నారన్నారు. పోలింగ్ బూత్ వివరాలు తెలిపే చిరునామాలో కులాల పేర్లతో కూడిన పదాలను వాడకుండా చూడాలని అదే విధంగా ఎన్నికలకు సంబంధించిన పత్రాల్లో కొన్ని ఆంగ్ల పదాలను తెలుగుభాషలో తర్జుమా చేసే క్రమంలో సరైన పదాలను వినియోగించాలని పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్వీడో స్వాతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పీవీ గజేంద్రరావు, దిలీప్కుమార్, కొడాలి శర్మ, ఎస్. బాలాజీ పాల్గొన్నారు.