ఫాగింగ్‌ ఊసేది! | - | Sakshi
Sakshi News home page

ఫాగింగ్‌ ఊసేది!

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

● మున్సిపాలిటీల్లో దోమల నియంత్రణ చర్యలు కరువు ● మురుగునీటితో పట్టణ ప్రజలకు తప్పని అవస్థలు

కాగజ్‌నగర్‌టౌన్‌: ఇటీవల కురిసిన వర్షాలతో దోమలు తీవ్ర వృద్ధి చెంది పట్టణాలపై దండయాత్ర చేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది అలసత్వంతో నివారణ చర్యలు అటకెక్కాయి. జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని మురుగు కాలువలు, ఖాళీ స్థలాలు, పాతటైర్లు, ఇతర నీటి నిల్వ కేంద్రాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ఏటా వానాకాలం సీజన్‌లో పారిశుద్ధ్య చర్యలతోపాటు దోమల నివారణకు రెండు, మూడు సార్లు ఫాగింగ్‌ చేయించేవారు. కానీ ఈసారి వానాకాలం ముగింపునకు వచ్చినా ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో దోమల సంతతి విపరీతంగా పెరిగింది.

ఖాళీ స్థలాలే అడ్డాలు

రెండు మున్సిపాలిటీల్లోని ఆర్టీసీ డిపో, బస్టాండ్‌, మార్కెట్‌ ఏరియాల్లో పారిశుద్ధ్యం అంతంతే ఉంది. కాగజ్‌నగర్‌లోని ప్రధాన మురుగు కాలువకు ఆనుకుని ఉన్న కాలనీలు నౌగాం బస్తి, మార్కెట్‌ ఏరియా, ద్వారకానగర్‌, కౌసర్‌నగర్‌, కాపువాడ, సంజీవయ్య కాలనీ, సర్‌సిల్క్‌ కాలనీలోని డ్రెయినేజీల్లో మురుగు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. రోజుల తరబడి డ్రెయినేజీల్లో మురుగు నీరు నిల్వ ఉండటం, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగడంతో ఈగలు, దోమల బెడద తప్పడం లేదు. అలాగే ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌజ్‌, ఈఎస్‌ఐ కాలనీ, గాంధీనగర్‌, బాలాజీనగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక వీధిలో ఖాళీ ఇళ్ల స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి నీటి కుంటలు ఏర్పడ్డాయి. ఇవి దోమలకు ఆవాసాలు మారుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నివారణ చర్యలు చేపట్టాలి

మురుగు కాలవల్లో దోమలు వృద్ధి చెంది ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టలేదు. సాయంత్రం 6 గంటలైతే చాలు విపరీతంగా దోమల బెడద ఉంది. కాలువల్లో ఆయిల్‌బాల్స్‌ వేయాలి. కాలనీల్లో ఫాగింగ్‌ చర్యలు చేపట్టాలి.

– సత్యనారాయణ, ద్వారకానగర్‌, కాగజ్‌నగర్‌

యంత్రాలు కొనుగోలు చేశాం

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో గతేడాది ఫాగింగ్‌ యంత్రాల ద్వారా కాలనీల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాం. మరమ్మతుల కారణంగా యంత్రాలు మూలన పడ్డాయి. ప్రస్తుతం రెండు కొత్త ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశాం. త్వరలోనే ఫాగింగ్‌ చర్యలు చేపడుతాం.

– శంకర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, కాగజ్‌నగర్‌

పల్లెలోనూ అధ్వానం

జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గం కొలువుదీరినా పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ కార్యక్రమాలు అంతంతే సాగుతున్నాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. అంతర్గత రోడ్లపై బురద, డ్రెయినేజీ మురుగునీటితో అధ్వానంగా మారాయి. కనీసం ఇళ్లవద్ద ఉన్న చెత్తను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, కూడా రావడం లేదని పల్లె జనం ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement