ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఈసీఆర్
వైరారూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ ఆనుదీప్ దురిశెట్టి సూచించారు. వైరా మండలం పాలడుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈసీఆర్ అమలును మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు, నాలుగో తరగతిలో విద్యార్థులతో ఆంగ్లం అక్షరాలు, పదాలు రాయించి వాటి ఉచ్చారణ, అర్థాలు ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈసీఆర్ అమలును పకడ్బందీగా చేపడితే విద్యార్థులకు జీవితాంతం ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ వంటల తయారీకి గ్యాస్ ఉపయోగించాలని సూచించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ సురేష్బాబు, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దయాకర్రావు, రమేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
●మండలాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ చదవడంతో పాటు రాసేలా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ అనుదీప్ ఆలోచనల నుంచి ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మూడు నెలల క్రితం శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమ రెండో విడత ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యాన ఈసీఆర్ను మరింత పకడ్బందీగా అమలు చేసేలా పర్యవేక్షణకు ముగ్గురు అధికారులను నియమించారు. ప్రతీ అధికారికి ఏడేసి మండలాల బాధ్యతలు అప్పగించగా వీరు ఈసీఆర్ అమలుపై నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
మండలాల కేటాయింపు ఇలా..
అదనపు కలెక్టర్ శ్రీజకు చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, సింగరేణి, కామేపల్లి మండలాలు కేటాయించారు. అలాగే, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్కు ఏన్కూరు, కల్లూరు, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, పెనుబల్లి, వైరా మండలాల బాధ్యతలు అప్పగించగా, జెడ్పీ సీఈఓ దీక్షారైనా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల మండలాల్లో బోధనను పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రతీ బుధవారం వివరాల నమోదు
అన్ని పాఠశాలల్లో ప్రతీ బుధవారం ఈసీఆర్ను పర్యవేక్షించి అమలు స్థితిపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా వెనకబడిన పాఠశాలలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించిచే అవకాశముంటుంది. అలాగే, ప్రతీ అధికారి వారానికి కనీసం రెండు పాఠశాలలను సందర్శించాలి. ఇదే సమయాన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్లో నమోదునా దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే, మండలాల వారీగా పురోగతి, ,ఎఫ్ఆర్ఎస్ అమలు తదితర అంశాలపై 15రోజులకోసారి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


