
మ.. మహిళ స.. సంఘం!
ఖమ్మంసహకారనగర్: ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోవద్దనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో వయోజన విద్య కార్యక్రమం కొనసాగగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం భాగస్వామ్యం చేసింది. ఈమేరకు జిల్లాలోని 21మండలాల్లో ఇటీవల చేపట్టిన సర్వే ద్వారా 1.54లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. తొలివిడతగా ఉల్లాస్ పేరుతో 50,564మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు.
లక్ష్యం 50,564మంది
ఉల్లాస్ పథకం ద్వారా జిల్లాలో 50,564 మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే వీరి వివరాలను ఉల్లాస్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈక్రమంలోనే ఖమ్మం కార్పొరేషన్ పరిధి 60డివిజన్లలో 16,984మందిని గుర్తించారు. తొలి విడతగా మహిళా స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులైన సభ్యులకు అదే సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులు శిక్షణ ఇస్తారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాల్లో 600మంది నిరక్షరాస్యులైన హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లతో అక్షరాలు నేర్పించనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా 59వ డివిజన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘ఉల్లాస్’ అమలుకు 59వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ నిరక్షరాస్యులకు శిక్షణ ఇచ్చేలా సిద్ధమవుతున్నారు. ఈ డివిజన్లో 800 మంది నిరక్షరాస్యులు ఉండగా, అక్షరాలు నేర్పించే బాధ్యత ముగ్గురు అంగన్వాడీలు, ముగ్గురు ఆర్పీలకు అప్పగించారు.
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేలా ప్రణాళిక
1.54లక్షల మంది నిరక్షరాస్యుల గుర్తింపు
తొలి దశలో 50,564 మందికి తర్ఫీదు
మహిళా సంఘాల సభ్యులకు
మొదటి విడతలో ప్రాధాన్యత
త్వరలోనే శిక్షణ ప్రారంభం
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే క్రమాన ఇప్పటికే గుర్తింపు పూర్తయింది. మండల, గ్రామస్థాయిలో రిసోర్స్ పర్సన్లకు త్వరలోనే శిక్షణ ఉంటుంది. ఆతర్వాత నిరక్షరాస్యులకు పుస్తకాలు అందజేసి శిక్షణ ప్రారంభిస్తాం. తొలిదఫా స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరా స్యులుగా చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
– సీహెచ్.అనిల్కుమార్,
వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్

మ.. మహిళ స.. సంఘం!

మ.. మహిళ స.. సంఘం!