రైతు భరోసాకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసాకు రంగం సిద్ధం

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

రైతు భరోసాకు రంగం సిద్ధం

రైతు భరోసాకు రంగం సిద్ధం

● జిల్లాలో పాత పట్టాదారులు 3,38,463 మంది ● కొత్తగా మరో 4,693 మంది అర్హులు ● నూతన పట్టాదారుల దరఖాస్తుకు 20 వరకు గడువు

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్‌కు అందించే రైతు భరోసాపై ఇప్పటికే జిల్లాలో అర్హుల వివరాలను సేకరించింది. ఈ పథకానికి జిల్లాలో ఇప్పటికే 3,38,463 మంది రైతులు ఉండగా, ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన వారికీ అవకాశం కల్పించింది. దీంతో కొత్తగా మరో 4,693 మంది రైతులు సాయం పొందనున్నారు. మొత్తంగా 3,43,156 మందికి ఈ వానాకాలంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.350 కోట్ల మేర అందించనున్నారు.

20 వరకు దరఖాస్తుకు అవకాశం..

ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 వరకు అవకాశం ఉంది. భూ భారతి ద్వారా పొందిన పట్టాదారు పాస్‌ పుస్తకం లేదా డిజిటల్‌ సంతకం(భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నుంచి) జిరాక్స్‌ కాపీ, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు పాస్‌బుక్‌ జతచేసి క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణాధికారులకు దరఖాస్తులు అందించాలి. గతంలో రైతుబంధు పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

నేడు రైతులతో సీఎం ముఖాముఖి

ప్రస్తుత వానాకాలం సీజన్‌కు అమలు చేసే రైతు భరోసాతో పాటు పలు అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాల్లో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతారు. జిల్లాలోని 21 మండలాల్లో 129 క్లస్టర్లు ఉండగా వీసీకి 62 రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని వీక్షించేందుకు ఒక్కో వేదికలో 200 మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పెండింగ్‌ భరోసా సంగతేంటి..?

ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు రైతు భరోసా అమలు చేస్తున్న క్రమంలో గత యాసంగి సీజన్‌లో నిలిపేసిన బకాయిల సంగతేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడు జిల్లాలో 3,51,592 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. అయితే వారిలో నాలుగైదు విడతలుగా మార్చి నాటికి 2,65,392 మంది రైతుల ఖాతాల్లో రూ. 215.98 కోట్లు జమ చేశారు. ఇంకా 86 వేల మంది రైతులకు రూ.156 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ సీజన్‌లో అందించే పెట్టుబడి సాయంతో కలిపి పాతవి కూడా చెల్లించాలని ఆయా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడవగా, ప్రస్తుతం మూడో సీజన్‌ ప్రారంభమైంది. గత ఎన్నికల సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పుడు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.12 వేలే, అందులోనూ కొందరు రైతులకే అందించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement