
స్థానిక సందడి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని నెలలుగా ఎలాంటి హడావిడి లేకున్నా.. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయనే సంకేతాలతో ఆశావహులు రంగంలోకి దిగారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కూసుమంచిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలపై ప్రకటన చేశారు. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో తేదీలపై స్పష్టత వస్తుందని కూడా చెప్పారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్కు పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక స్థానికంగా టికెట్లు ఆశిస్తున్న నేతలు కార్యకర్తలను సమన్వయం చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసి కలిసికట్టుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని అధికార పార్టీ తమ నాయకులకు సూచిస్తోంది.
ఏడాదిగా ప్రత్యేక పాలన..
జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉండగా.. 2019లో 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పంచాయతీ పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. వాటి గడువు 2024 ఫిబ్రవరి ఒకటిన ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పల్లెల్లో దాదాపు 16 నెలలుగా ఇన్చార్జ్లే దిక్కయ్యారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇన్చార్జ్లుగా నియమితులైన అధికారులు ఇతర పనులతో సతమతం అవుతుండడంతో స్థానిక పాలనపై దృష్టి సారించలేకపోతున్నారు.
సమస్యలతో వాయిదాలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించాయి. ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది. అయితే కులగణన తదితర సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు 3,148 బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తిచేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
మరోసారి సమాయత్తం..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని మూడు రోజుల క్రితం మంత్రి సీతక్క, ఆదివారం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు కార్యరంగంలోకి దూకారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ఇంటింటినీ సందర్శిస్తున్నారు. ఈసారి ఎలాగైనా స్థానికంగా తమ పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన ముగ్గు రు మంత్రులు కూడా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు.
మంత్రి పొంగులేటి ప్రకటనతో
కేడర్లో కదలిక
ఇటీవలే తుమ్మల కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం
గ్రామాల్లో మొదలైన ఆశావహుల
హడావిడి
ఏకగ్రీవాలపై అధికార పార్టీ ఫోకస్
ఏకగ్రీవాలపై దృష్టి..
జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉండగా.. 12 పంచాయతీలు ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 577 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో ఎక్కువ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే మంత్రులు, నేతలు.. స్థానిక నాయకులకు సూచనలు చేస్తున్నారు. ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ఆయా గ్రామాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో, మరో మంత్రి పొంగులేటి ఆదివారం కూసుమంచిలో జరిగిన పాలేరు నియోజకవర్గస్థాయి ముఖ్య నేతల సమావేశంలోనూ ఇదే విషయమై సూచనలు చేశారు.