ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో భట్టిని కలిసిన తుమ్మల శాలువాతో సత్కరించారు.
జిల్లాలో నేడు మంత్రి
పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో సీసీ రోడ్డు పనులకు, 9.30 గంటలకు కొరట్లగూడెం, 10 గంటలకు మోటాపురంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు మోటాపురం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళతారు. కాగా, పొంగులేటి పర్యటన వివరాలను నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఆయన వెంట నాయకులు శాఖమూరి రమేష్, కడియాల నరేష్, బచ్చలకూరి నాగరాజు, రావెళ్ల కృష్ణారావు ఉన్నారు.
క్రీడా పాఠశాలల్లో
ప్రవేశాలకు ఎంపిక పోటీలు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పరిధి ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025 –26 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి ప్రకటనలో తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశానికి మూడంచెల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈనెల 16 నుండి 19వ తేదీ వరకు మండల స్థాయిలో, ఇక్కడ ప్రతిభ చూపిన వారికి ఈనెల 23 నుండి 26 వరకు జిల్లా స్థాయి పోటీలు, ఆ తర్వాత జూలై 1నుండి 5వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. 01–09–2016 నుండి 30–8– 2017 మధ్య జన్మించిన వారు అర్హులు కాగా, వివరాలకు tgss.telangana. gov.inలో పరిశీలించాలని సూచించారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని పేర్కొన్నారు.