
రాజీ మార్గమే రాజమార్గం
మధిర/సత్తుపల్లిటౌన్: కేసులను పరిష్కారంలోలో రాజీ మార్గమే.. రాజ మార్గమని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్, మధిర కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రశాంతి తెలిపారు. శనివారం మధిర కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్ పర్సన్ ఎన్.ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో.. మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల కూడా పాల్గొని పలు కేసులు పరిష్కరించారు. మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి పరిధిలో 289కేసులు పరిష్కారం కాగా రూ.1,32,900జరిమానా విధించారు. అదేవిధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి పరిధిలో 240 కేసులు పరిష్కారం కాగా, రూ.3,86,800జరిమానా విధించారు. అదే విధంగా సత్తుపల్లి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జడ్జి శ్రీనివాస్ పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీ అయితే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని స్పష్టం చేశారు. రాజీ చేసుకుంటే ఇరువురు గెలుస్తారని, సమయం, డబ్బు ఆదాఅవుతుందన్నారు. క్షణికావేశంలో జరిగిన కేసులకు రాజీపడేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ సందర్భంగా పలువురి బాధితులకు అవార్డులు సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్జడ్జి షేక్ మీరాఖాసీం సాహెబ్, జూనియర్ సివిల్ జడ్జి బి.సుమబాల, సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్లు జె.గోపాలరావు, అబ్రహం, బార్ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు, మల్లెపూల వెంకటేశ్వరరావు, ఏపీపీ భద్రయ్య, మధిర పట్టణ సీఐ రమేష్ ,ఎస్సై చంద్రశేఖర్, బ్యాంక్ అధికారులు, పోలీస్, కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.