
లోక్ అదాలత్తో శాశ్వత పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ● జిల్లా కోర్టుల్లో 6,220 కేసుల పరిష్కారం
ఖమ్మంలీగల్: ఇరుపక్షాలు లోక్ అదాలత్లో రాజీ పడడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇక్కడి తీర్పుపై అప్పీల్కు సైతం అవకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కె.ఉమాదేవి తదితరులతో కలిసి పాల్గొన్న జిల్లా జడ్జి రాజగోపాల్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని, తద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారమే కాకుండా ప్రీ లిటిగేషన్, సివిల్ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు ఇతరత్రా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కాగా, లోక్ అదాలత్ ద్వారా 62 మోటార్ వెహికల్ ప్రమాద కేసుల్లో రాజీ ద్వారా రూ.2.80 కోట్ల పరిహారం ఇప్పించామని వెల్లడించారు. జిల్లా కోర్టు పరిధిలోనే కాకుండా సత్తుపల్లి, మధిర కోర్టుల్లోనూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామని తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వృద్ధురాలు గొడ్ల రత్తమ్మ తరపున న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ కేసు దాఖలు చేయగా సత్వర పరిష్కారం చేసి హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.11.50 లక్షల అవార్డ్ జారీ చేశారు. అలాగే, భార్యాభర్తలైన భవాని – వీరభద్రం వివాదాన్ని కూడా రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దేవినేని రామప్రసాదరావు, వి.శీనయ్య, ఎం.అర్చన కుమారి, ఎంకల్పన, టి.మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.వెంకటేశ్వరరావుతో పాటు న్యాయవాదులు గద్దల దిలీప్కుమార్, బండారుపల్లి గంగాధర్, పి.సంధ్యారాణి, కొత్తపల్లి రామారావు, స్వర్ణ రాంబాబు, మందడపు శీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.