ఖమ్మంరూరల్ : తాను తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదంటూ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన భూక్యా నాగేశ్వరరావు మిరప కల్లంలో కూర్చుని, మిర్చి దండ మెడలో వేసుకుని గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రూ.2లక్షల లోపు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అంతకంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని తాను బ్యాంకులో జమ చేసినా.. నేటికీ మాఫీ కాలేదని వాపోయాడు. రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేస్తే ఇప్పుడు పంటకు గిట్టుబాబు ధర రావడం లేదని, ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరాడు.