సాక్షి,బళ్లారి: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో బంకుల్లో తగినంత గ్యాస్ ఉన్నప్పటికీ గ్యాస్ కొరత సృష్టిస్తున్నారని ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. బుధవారం సాయంత్రం జిల్లా ఆటో యూనియన్ ఆసోసియేషన్ అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున చేరి నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ మెయిన్ రోడ్డులోని ఎల్పీజీ గ్యాస్ బంకు వద్ద ఆటోడ్రైవర్లు పెద్ద సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. గ్యాస్ బంకు వద్ద బైఠాయించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
స్టాకు ఉన్నా నో స్టాక్ బోర్డులు
అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుండటంతో గ్యాస్ సమస్య ఏర్పడుతుందని, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిసి, నగరంలోని ఆరు ఎల్పీజీ గ్యాస్ బంకుల్లో కూడా తగినంత స్టాకు ఉన్నా తమ వద్ద గ్యాస్ లేదని నో స్టాక్ బోర్డులు పెట్టి గ్యాస్ ధరలు పెరిగిన తర్వాత అమ్మడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.
పేద ఆటోడ్రైవర్ల పొట్టకొడుతున్నారు
పేద ఆటోడ్రైవర్ల పొట్టకొట్టేందుకు గ్యాస్ బంకుల యజమానులు సిద్ధం అయ్యారన్నారు. గ్యాస్ కొరత సృష్టించడంతో గ్యాస్తో నడిచే ఆటోలను నడపక పోవడంతో రెండు రోజుల నుంచి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బంకు వద్ద పెద్ద సంఖ్యలో ఆటోడ్రైవర్లు చేరి నిరసన వ్యక్తం చేయడంతో స్థానిక పోలీసు ఽఅధికారులు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. ఆటోలకు గ్యాస్ కొరత సృష్టించకూడదని, గ్యాస్ స్టాక్ ఉన్నా కొరత సృష్టించడం తగదని సూచించారు. గ్యాస్ బంకుల్లో స్టాక్ను కూడా పరిశీలించారు. ఆటోలకు గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు.
కొరత సృష్టించి అధిక ధరకు అమ్ముతున్నారు
గ్యాస్ బంకుల వద్ద ఆటోడ్రైవర్ల మండిపాటు


