శివకుమార స్వామి ప్రతిమకు మఠాధిపతుల పూజలు
స్వామీజీ పీఠానికి రాష్ట్రపతి ముర్ము నమస్సుమాంజలి
నేత్రపర్వంగా పల్లకీ ఉత్సవం
తుమకూరు: లక్షలాది మంది పేద పిల్లలకు అన్నం పెట్టి, ఆశ్రయం కల్పించి, చదువులు చెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన కాయక యోగి, త్రివిధ దాసోహిగా పేరొందిన తుమకూరు సిద్ధగంగ మఠం దివంగత మఠాధిపతి డా.శివకుమార స్వామీజీ 119వ జయంతి, గురువందన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బసవేశ్వరుని ఆదర్శాలను పాటిస్తూ సమాజ ఉద్ధరణకు పాటు పడిన శివకుమారస్వామికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు.
ఘనంగా పల్లకీ ఊరేగింపు
ఉదయం నుంచే స్వామి సమాధికి ప్రస్తుత మఠాధిపతి సిద్ధలింగస్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి తదితరుల ప్రముఖ స్వామీజీల ఆధ్వర్యంలో వివిధ పూజలు, క్రతువులు నిర్వర్తించారు. మంత్రఘోషతో మార్మోగింది. స్వామీజీ కాంస్య ప్రతిమను పుష్ప పల్లకీలో రుద్రాక్ష మంటపం వరకు వైభవంగా ఊరేగించారు. వందలాది మహిళలు పూర్ణకుంభ కలశాలను ధరించి పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ చేశారు. గవర్నర్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, సోమణ్ణ, రాష్ట్ర మంత్రులు జీ.పరమేశ్వర్, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాళ్కర్ పాల్గొన్నారు.
అనన్యమైన సేవ: ప్రధాని మోదీ
శివాజీనగర: తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనను స్మరించుకున్నారు. విద్యా, సామాజిక రంగాలలో స్వామి నిస్వార్థ సేవ, మనుషులపై కరుణ గొప్పవని కొనియాడారు. శివకుమారస్వామికి నా గౌరవపూర్వక నివాళులు. ఆయన ప్రజల స్మృతిలో సదా నిలిచి ఉంటారని ఎక్స్లో పోస్టు చేశారు. ఇతరుల ఎదుగుదల కోసం జీవితాన్ని ధారపోసిన స్వామి, నిజమైన సేవను ప్రపంచానికి చూపించారన్నారు.
వైభవంగా శివకుమారస్వామి
జయంతి ఉత్సవం
తుమకూరు సిద్ధగంగ మఠానికి రాష్ట్రపతి రాక


