దొడ్డబళ్లాపురం: హావేరి పట్టణంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండులో ఒక బస్సు బీభత్సం సృష్టించింది. నిర్ణీత ప్లాట్ఫారం మీదకు వచ్చిన బస్సును డ్రైవరు అదుపు చేయలేకపోయాడు. దీంతో కూర్చున్న ప్రయాణికుల మీదకు దూసుకువచ్చింది. అక్కడున్నవారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది. బస్సు ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు చనిపోయాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హావేరి నుంచి లక్ష్మేశ్వరకు వెళ్లే బస్సు ఇది. సవణూరు పట్టణ నివాసి హజరత్ అలీ (2) హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బంకాపుర నివాసులు వాసుదేవ (44), హర్ష (6), కావ్యాంజలి (39) గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవరుపై హావేరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దుర్ఘటనతో బస్టాండులో కలకలం ఏర్పడింది. ప్రయాణికులు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ దుర్ఘటన అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయింది.
ప్రయాణికుల మీదకు వచ్చేసిన వైనం
బాలుడు మృత్యువాత


