రాయచూరులో నిర్వహించిన మహావీర్ జయంతిలో
పాల్గొన్న జిల్లాధికారి నితీష్, ఇతర ప్రముఖులు
బళ్లారిలో నిర్వహించిన మహావీర్ జయంతిలో పాల్గొన్న
మేయర్ గాదెప్ప, ముండ్రిగి నాగరాజ్ తదితర ప్రముఖులు
చిత్రపటం ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖర్రెడ్డి, జైన్ సమాజ ప్రముఖులు
సాక్షి,బళ్లారి/బళ్లారిటౌన్: జైన మత ప్రచారకుడు, భగవాన్ మహావీర్ జయంతిని కన్నుల పండువగా ఆచరించారు. మంగళవారం భగవాన్ మహావీర్ జైన్ జయంతిని పురస్కరించుకుని కన్నడ సాహిత్య పరిషత్, జిల్లా పంచాయతీ, మహానగర పాలికె సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహావీరుని చిత్రపటాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు ముఖ్యంగా లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు మాట్లాడుతూ మహావీరుడు బోధించిన పంచతత్వాలు అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మనిషి జీవిత సత్యానికి మార్గదర్శకాలని చెప్పారు. ప్రతి జీవిలో అత్మ ఉందని, ఎవరికీ హాని చేయకూడదని సూచించారన్నారు. ప్రతి ప్రాణిని ప్రేమించాలని, చంపకూడదని సూచించిన మహానుభావుడు మహావీరుడన్నారు. సత్యాన్ని పాటించడం, ఇతరుల ఆస్తిని ఆశించకపోవడం, నియమ నిష్టలతో జీవించడం, భౌతిక ఆశలు విడిచిపెట్టడం వంటి విలువలను నేర్పించారన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉద్భవించాయన్నారు. అయితే జైన మతం అహింసా సిద్ధాంతాలు, నైతిక విలువలు సమాజ ఐక్యతకు దోహదం చేశాయన్నారు. జైన సమాజం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహావీరుని బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. మేయర్ గాదెప్ప మాట్లాడుతూ మహావీరుడు ఇచ్చిన శాంతి సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరం అన్నారు. జైన్ మతానికి చెందిన వారు జీవహింసకు దూరంగా ఉండేందుకు మాస్క్ ధరించడం, పాదరక్షలు కూడా లేకుండా నడవడం వంటి ఎన్నో సుగుణాలతో జీవిస్తున్నారని కొనియాడారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర్ తదితరులు మహావీరుని గుణగణాలను కొనియాడారు. కార్యక్రమంలో కన్నడ సంస్కృతీ శాఖ ఏడీ బీ.నాగరాజు, జిల్లా జైన్ సంఘం అధ్యక్షుడు సురేష్మల్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల మైదానం నుంచి మహావీరుని ప్రతిమను ఊరేగింపుగా జైన్ భవనానికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా జైన్ సమాజం వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
జయంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
మహావీర్ జయంతిలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహావీర్ జైన్ విగ్రహ ఊరేగింపులో పాల్గొని ఆ సమాజానికి చెందిన వారితో ఊరేగింపులో పాల్గొని భక్తిని చాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హింసామార్గాన్ని విడనాడి, శాంతి మార్గంలో నడుస్తూ సమాజానికి జైనులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా జైన్ సమాజం నిలుస్తోందని గుర్తు చేశారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్ : మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం మహావీర్ వృత్తం వద్ద స్తూపానికి పూలమాలలు వేసి మాట్లాడారు. వర్థమాన మహావీరుని చిత్రపటానికి సమాజ ప్రముఖుడు సుఖాణి పూలమాలలు వేశారు. సుమతీనాథ్ జైన్ శ్వేతాంబర్ భవనంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి, సాంఘీక సంక్షేమ శాఖ, జైన్ సముదాయం ఆధ్వర్యంలో వర్ధమాన మహావీర్ జయంతిని జ్యోతి వెలిగించిన అసిస్టెంట్ కమిషనర్ హంపన్న మాట్లాడారు. సమాజంలో మానవుడు సత్యాంశాలతో జీవించాలన్నారు. అహింసా మార్గాన్ని అనుసరించి మానవత్వంతో సేవలు అందించాలన్నారు. మహావీర్ చిత్రపటం ఊరేగింపులో ఎస్పీ అరుణాంగ్షు గిరి జైన్ సమాజం సంచాలకుడు అశోక్ కుమార్ జైన్, జైన్ నేతలు అమిత్, ఆశిష్, మోహిత్, వినయ్, ఆయుష్ సంచితి, రాహుల్, హితేష్, కృష్ణలున్నారు.
జయంత్యుత్సవంలో పలువురు వక్తలు
కన్నుల పండువగా మహావీర్ జయంతి


