సాక్షి,బళ్లారి: దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న బళ్లారి నుంచి సిరుగుప్ప, సింధనూరు మీదుగా లింగసూగూరు వరకు నూతన రైలు మార్గ నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు మహేశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి సమస్యలను వివరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి బళ్లారి జిల్లాలో రైల్వే సమస్యలను, నూతన రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం గురించి వివరించారు. ఈ ప్రాంత రైల్వే అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ నూతన రైలు మార్గం అమలు చేస్తే మొదటి దశలో బళ్లారి నుంచి సింధనూరు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు ఎన్నో సమస్యలను అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ఈ మార్గం భవిష్యత్తులో చామరాజనగర్, మైసూరు, హాసన్, అరసీకెరె, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు మీదుగా బీదర్ వరకు సుమారు 950 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంగా అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. అదే విధంగా సిరుగుప్ప ప్రాంతంలో తుంగభద్ర ఆయకట్టులో వరిని పండించే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, బియ్యాన్ని వివిధ ప్రాంతాలకు రైళ్ల ద్వారా రవాణాతో ఎగుమతి చేయవచ్చన్నారు. అలాగే బళ్లారి మార్గం గుండా వందేభారత్, సూపర్ ఫాస్ట్ జన శతాబ్ధి లేదా ఇంటర్ సిటీ రైలు సేవలను ప్రారంభించాలన్నారు. రైల్వే క్రియా సమితి అందించిన వినతిపత్రాన్ని క్షుణ్ణంగా చదివిన అనంతరం బళ్లారి మార్గం గుండా రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సమితి బృందం తెలిపారు.
కుష్టిగి నుంచి బెంగళూరుకు రైలు నడపాలి
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప డివిజనల్ రైల్వే మేనేజర్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుబ్లీలోని రైల్వే జోనల్ కార్యాలయంలో రైతులు కలసి వినతి పత్రం అందించారు. కళ్యాణ కర్ణాటకలోని గదగ్– వాడి రైలు మార్గంలో కుష్టగి నుంచి హుబ్లీకి రైలును ప్రారంభించారని, కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలన్నారు. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లడానికి హర్లాపుర స్టేషన్లో స్టాపింగ్ కల్పించాలని కోరారు.
కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి
రైల్వే క్రియా సమితి బృందం వినతి


