హుబ్లీ: ఏప్రిల్ 1 నుంచి జనగణన స్వచ్ఛంద నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొని తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించాలని హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన వైబ్సైట్లో మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేయించుకొని, మీ స్థలాన్ని ఎంపిక చేసుకొని డిజైన్లో మ్యాప్ను గుర్తించి ఇంటి వివరాలతో పాటు 33 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మీ ఫోన్కు వచ్చే రెఫరెన్స్ ఐడీ నంబర్ ఏప్రిల్ 15 తర్వాత, తమ ఇంటి దగ్గరకు వచ్చే జనగణన సేకరణ అధికారులకు ఇవ్వాలన్నారు. ఏప్రిల్ 16 తర్వాత క్షేత్ర పరిశీలన ప్రక్రియ జరగనుంది. ఈ గడువులో జనాభా సేకరణ అధికారులు తమ ఇంటికి వచ్చి వివరాలను పరిశీలిస్తారు. ఒక వేళ స్వచ్ఛంద జనగణన పూర్తి చేయక పోతే జనాభా సేకరణదారులే వివరాలు నమోదు చేస్తారు.
28 మంది సిబ్బంది నియామకం
ఈ నేపథ్యంలో పాలికె పరిధిలో 28 మంది సిబ్బందిని నియమించామన్నారు. విద్య, రెవెన్యూ శాఖలతో పాటు పాలికె ఇతర శాఖల సిబ్బంది జనగణన సర్వేలో పాల్గొంటారన్నారు. ఒక్కొక్క సిబ్బందికి 180 ఇళ్ల సర్వే బాధ్యత అప్పగించామన్నారు. ఇందులో భాగంగా సంబంధిత జనాభా సేకరణ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఏప్రిల్ 3 నుంచి మూడు రోజులు శిక్షణ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత సిబ్బందికి ఆయా జోన్ కార్యాలయాలను కేటాయిస్తూ ఈ విషయంలో హుబ్లీ మహిళా పాలిటెక్నిక్, ఐడీఎంఆర్ కళాశాలల్లో శిక్షణను ఏర్పాటు చేశారన్నారు. 2027 జనగణన తొలి దశ జాబితా ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో జరగనుందన్నారు. ఈ 30 రోజుల గడువులో ఈ ప్రక్రియ కొనసాగనుందని ఆయన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.
జనగణన స్వచ్ఛంద నమోదుకు శ్రీకారం
ప్రజలు అవసరమైన కుటుంబ సభ్యుల వివరాలు అందించాలి
హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్
కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి


