సాక్షి,బళ్లారి: సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య కలహాలు, విభేదాలు, గొడవలు తదితర ఎన్నో సమస్యలు ఉండటం మనం వింటూ ఉంటాం. యాదగిరి జిల్లాలో ఓ అత్త తమ అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న కోడలికి ఏకంగా కిడ్నీ దానం చేసి తన మానవత్వం, ప్రేమ, త్యాగం ఎంతో గొప్పదని చాటుకుంది. యాదగిరి జిల్లా సరిహద్దు గ్రామమైన మాళనూరు గ్రామానికి చెందిన శాంతాబాయి, గుర్రణ్ణ దంపతుల కుమారుడు ప్రకాష్తో 14 ఏళ్ల క్రితం విజయపుర జిల్లా తాళికోటె తాలూకా హొసహళ్లి గ్రామానికి చెందిన బసమ్మ అనే యువతికి పైళ్లెంది. ప్రకాష్ బెంగళూరులో డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బసమ్మ గర్భం దాల్చినప్పుడు పలు వైద్య పరీక్షలు చేసిన సమయంలో ఆమెకు ఒక కిడ్నీనే పని చేస్తోందని గుర్తించారు.
8 ఏళ్ల తర్వాత బాగా ముదిరిన సమస్య
సంతానం కలిగిన 8 ఏళ్ల తర్వాత కిడ్నీ సమస్య మరింతగా ముదిరిపోయింది. కిడ్నీ మార్పిడి ఒకటే మార్గంగా మారింది. అత్త శాంతాబాయి (62) కోడలిని బతికించుకునేందుకు తన కిడ్నీని దానం చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చింది. శాంతాబాయి రక్తం గ్రూపు ఏ పాజిటివ్ కాగా బసమ్మ బ్లడ్ గ్రూపును ఓ పాజిటివ్గా గుర్తించారు. అయితే అన్ని వైద్య పరీక్షల తర్వాత అత్త కిడ్నీ కోడలికి సరిపోతుందని, ఇకపై ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాబోవని వైద్యులు నిర్థారించారు. చివరకు ఫిబ్రవరి 15వ తేదీన విజయపురలోని యశోద ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.
కిడ్నీ దానంతో కోడలు ప్రాణాలు కాపాడిన అత్త


