పోకిరీల వీలింగ్
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలో ఎయిర్పోర్టు రోడ్డులో ఆకతాయిలు రాడ్లు పట్టుకుని వీలింగ్ చేస్తూ ఇతరులను భయాందోళనకు గురిచేశారు. పైగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్కూటర్లో వీలింగ్ చేస్తూ, ఇనుప కడ్డీతో రోడ్డును తాకిస్తూ నిప్పురవ్వలు వచ్చేలా ఫీట్లు చేశారు. అలాగే నెలమంగల వద్ద తుమకూరు రోడ్డులో సామూహిక ప్రార్థనకు వచ్చిన యువకులు వందల సంఖ్యలో చేరి రోడ్ల మీద వీలింగ్ చేశారు. ఈ వీడియో కూడా వైరల్గా మారింది. నగరవాసులు ఈ వీడియోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోకిరీల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.
లెక్చరర్ కాదు.. కామాంధుడు
దొడ్డబళ్లాపురం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్ కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిని బెదిరించి లొంగదీసుకుని రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘోర ఉదంతం బెళగావిలోని ప్రైవేటు కళాశాలలో చోటుచేసుకుంది. కామాంధ అధ్యాపకుడు నాగేశ్వర్. ఇతడు బెళగావి తాలూకా బసవనకుడచి గ్రామం నివాసి. ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నాడు. అక్కడ పీయూసీ చదువుకునే ఓ అమ్మాయిని భయపెట్టి అఘాయిత్యాలు సాగిస్తున్నాడు. ఎవరికీ చెప్పకూడదని, చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇతని దారుణాలను తట్టుకోలేక బాధితురాలు బెళగావి క్యాంప్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ లెక్చరర్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
మైసూరు బెమెల్
ఫ్యాక్టరీలో పులి
● అటవీ సిబ్బంది గాలింపు
మైసూరు: అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను బెంబెలెత్తిస్తున్న పులి తాజాగా మైసూరులో అడుగుపెట్టింది. మైసూరు నగరంలోని బెమెల్ కర్మాగారం కార్యాలయ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. దానిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. మైసూరు కేఆర్ఎస్ రోడ్డులోని కోర్గళ్లి సమీపంలో బెమెల్ కర్మాగారం లోపల శనివారం పులి కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లారా చూడడంతో పాటు సీసీ కెమెరాలలో కూడా రికార్డయింది. బెమెల్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
పులి పిల్లలు బందీ
జిల్లాలోని హుణసూరు తాలూకా హనగోడు హోబళి గౌడనకట్టె గ్రామంలో గత నాలుగు రోజులుగా అటవీ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం నాలుగు పులి పిల్లలను పట్టుకున్నారు. సురక్షిత ప్రాంతంలో వాటిని వదిలిపెట్టారు. నాలుగు రోజుల క్రితం గ్రామంలోని పొలంలో తల్లి పులిని పట్టుకున్నారు. ఆ తర్వాత పిల్లలకోసం సోదాలు సాగించారు. పులుల వేట ముగియడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మోదీ పేటా తుమకూరు మహిళ చాతుర్యమే
తుమకూరు: ఉడుపి శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం తెలిసిందే. నెమలి ఫించంతో చేసిన అందమైన పేటాను ఆయన ధరించారు. అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టోపీ ఎక్కడ ఎవరు తయారు చేశారనే ఉత్సుకత మొదలైంది. తుమకూరు చిక్కపేటకు చెందిన ఉషా భాస్కర్ తయారుచేసిందే అని తెలిసి ఆమెను పలువురు అభినందిస్తున్నారు. వాస్తవానికి ఉడుపిలోని విష్ణు ఫ్లవర్ డెకరేటర్స్కు పేటా తయారీ బాధ్యతను అప్పగించారు. వారు తుమకూరు కళాకారిణి ఉషాను సంప్రదించి పేటా తయారీకి సూచించారు. మైసూరు పేటకు ముత్యాల హారం, బంగారు రంగు దారంతో, నెమలి ఫించంతో అలంకరించి పేటాను తీర్చిదిద్దారు. ప్రధాని ధరించడం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఆమె తెలిపారు.
పోకిరీల వీలింగ్


