
మురుగు కాలువలు నిర్మించాలి
రాయచూరు రూరల్: నగర వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో మురుగు కాలువలు నిర్మించాలని మాజీ నగర సభ సభ్యుడు శంశాలం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వివిధ కాలనీల్లో పర్యటించారు. రహదారిపై మురుగు ప్రవహించడంతో అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రత నెలకొనడంతో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు అప్రమత్తమై పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు రావాలని సూచించారు.
మానవ హక్కుల
ఉల్లంఘన సరికాదు
రాయచూరు రూరల్: భారత ప్రభుత్వం పాలస్తీనాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాత జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు అణ్ణప్ప మాట్లాడారు. ఇజ్రాయెల్ దేశం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గం అని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజలపై నిరంతరం దాడులు చేస్తోందని తెలిపారు. ఆకలిని యుద్ధంగా మార్చిందన్నారు. ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. దేశాలను ఆక్రమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు.
పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
● కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
హుబ్లీ: 2026 మార్చిలోపు క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దుకుందాం. ముఖ్యంగా ధార్వాడ జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. శుక్రవారం కలఘటికి తాలూకా ఆస్పత్రి ఆవరణలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మొక్కకు నీరు పోసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మనం నివసించే లేఅవుట్లు విద్యా సంస్థలు, పార్కులను శుభ్రంగా పెట్టుకోవాలన్నారు. నశముక్త అభియాన ద్వారా జాగృతి కల్పిస్తామని వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల సామాజిక నిధుల ద్వారా పాఠశాలల్లో కట్టడాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35 వేల డెస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే సుమారు 800 పాఠశాలలకు రంగులు వేయించినట్లు గుర్తు చేశారు. స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్లో భాగంగా బీపీ, షుగర్, నీటి క్యాన్సర్, గర్భశయ క్యాన్సర్, అలాగే రక్తహీనతతో పాటు వివిధ రోగాలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 2047 కల్లా భారత దేశం వికసిత భారత్గా తీర్చిదిద్దబడుతుందన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని సూచించారు. జిల్లాలోని వివిధ క్షేత్రాల సాధకులు, పౌర కార్మికులను సన్మానించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా సాధన పరికరాలు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ వర్చువల్గా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లాధికారి దివ్యప్రభు, ఎస్పీ గుంజన్ ఆర్య, డీహెచ్ఓ డాక్టర్.వనకేరి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డీడీ డాక్టర్ కుకనూర, ప్రముఖులు నాగరాజ్ శబ్బి, నింగప్ప సుతగట్టితో పాటు వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
తెగుళ్లపై అప్రమత్తత అవసరం
బళ్లారి రూరల్: జిల్లాలో వివిధ తాలూకాల్లో సల్ఫర్ కొరతతో కంది పంటకు సోకిన వ్యాధిని సులభంగా అరికట్టవచ్చని హగిరి ఐసీఏఆర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.పాలయ్య తెలిపారు. గురువారం తాలూకాలోని కగ్గల్లు గ్రామ రైతు సుముద్ర రాజు సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. కంది పంటకు సల్ఫర్ కొరత వల్ల ఏర్పడే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సల్ఫర్ కొరతో మొక్క మొదలు భాగం సన్నగిల్లి మొత్తం వ్యాపిస్తుందని తెలిపారు. ఇందువల్ల పంట దిగుబడి తగ్గి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాధిని నివారించడానికి ప్రతి ఎకరాకు 20 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 కిలోల పొటాషియం సల్ఫేట్ లేదా 50 కిలోల సూపర్ పాస్ఫేట్ చల్లాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రవి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మురుగు కాలువలు నిర్మించాలి

మురుగు కాలువలు నిర్మించాలి