● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కరీంనగర్క్రైం: న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ పోలీస్ హెడ్క్వార్టర్స్లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో నిర్వహించిన న్యాయ, పోలీస్శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. నూతన క్రిమినల్ చట్టాల నేపథ్యంలో న్యాయవ్యవస్థలో డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ కీలకంగా మారిందన్నారు. ఇంటర్–ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజేఎస్)తో శ్రీవన్ డేటా–వన్ ఎంట్రీశ్రీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పోలీస్ దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, కోర్టు రికార్డులను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయవచ్చన్నారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కోర్టు, పోలీస్శాఖలు సమన్వయంతో పనిచేస్తే కేసుల పరిష్కార ప్రక్రియలో జాప్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ–ఎఫ్ఐఆర్లను కోర్టులు సకాలంలో స్వీకరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వాటి పర్యవేక్షణకు అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. సమన్ల జారీ ప్రక్రియలోనూ సాంకేతికత వినియోగించాలని సమావేశంలో నిర్ణయించారు. తీర్పుల ప్రతులు, సాక్షుల వాంగ్మూలాలను సకాలంలో ఆన్లైన్ చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. గంగాధర పోలీస్స్టేషన్ పరిధిలో పాత కేసులకు కోర్టు పరిధి మారిన నేపథ్యంలో వాటి స్వీకరణకు సంబంధించిన అంశాలను సమావేశంలో పరిశీలించారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


