కాలభైరవం భజే..
● వైభవంగా సంతతధారాభిషేకం
● ప్రారంభమైన కాలభైరవ స్వామి
జన్మదినోత్సవాలు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదినోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ అనంతరం72 గంటలపాటు నిరంతరంగా కొనసాగే సంతతధారాభిషేకాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, మనీష్ శర్మ, ఆలయ ఈవో ప్రభు గుప్తా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం బద్దిపోచమ్మకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, సిబ్బందితోపాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.
నేడు లక్ష దీపార్చన
ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం లక్షదీపార్చనను సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.


