
‘గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’
కామారెడ్డి టౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయనమాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కష్టపడి ప్రతి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లతో పాటు జెడ్పీ పీఠం కూడా బీజేపీ కై వసం చేసుకునేలా కష్టపడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర నాయకులు మురళీధర్గౌడ్, పైడి ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి: ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఆనంద్, మల్లేశ్లు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. గతనెలలో మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆనంద్ జావలిన్త్రో లో, మల్లేశ్ 60 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటినందుకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. వీరు వచ్చేనెల 10 నుంచి 14 వరకు ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ మోహన్రెడ్డి, పీడీ లింగం, పీఈటీ రవీంద్ర, కోచ్ సురేశ్ అభినందించారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుండడంతో దిగువన గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి భారీ వరదలు వస్తున్నాయనే సమాచారం మేరకు అధికారులు ప్రాజెక్ట్ నుంచి 39 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం రాత్రి వరకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ నీటిని మరింత ఖాళీ చేయాలన్న ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇన్ఫ్లో కన్నా అవుట్ ఫ్లోను ఎక్కువ చేశారు. నది పరీవాహక ప్రాంతాలైన మెండోరా మండలం దూదిగాం, కోడిచర్ల, చా కిర్యాల్, పోచంపాడ్, సావెల్ గ్రామాల్లో పంట లు నీట మునుగుతున్నాయి. ప్రాజెక్టు దిగువన ఉన్న వడ్డెర కాలనీలోకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోడిచర్ల, సావెల్ గ్రామాల మధ్య వంతెనపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మెండోరా రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఖలీల్వాడి(నిజామాబాద్అర్బన్): నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం మరోమారు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. గతంలో చర్లపల్లి జైలు జూనియర్ అసిస్టెంట్, ఖైదీ భార్యపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోక్సో కేసు కూడా నమోదు అయ్యింది. తాజాగా కామారెడ్డి జైలు జూనియర్ అసిస్టెంట్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జుడీషియల్ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చింతల దశరథం సెలవులో ఉన్నట్లు తెలిసింది.

‘గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’