
‘నిజాంసాగర్’లో ఎకో టూరిజం
కామారెడ్డి క్రైం : నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రూ. 9.98 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో టూరిజం కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 9.98 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం జలాశయం వద్ద ఇప్పటికే 12 ఎకరాల 30 గుంటల భూమిని సేకరించామన్నారు. గుర్తించిన ఆ స్థలంలో వెంటనే భూమి చదును, పిచ్చి మొక్కల తొలగింపు పనులు పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా డీలక్స్ గదులు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మెటరీ, ముఖ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం, థీమ్ గార్డెన్, చిన్న పిల్లల ఆట స్థలాల నిర్మాణాలకు శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ సోహెల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం, సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 9.98 కోట్లతో అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి
కామారెడ్డి క్రైం: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. విధుల్లో అలస త్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోకు సూచించారు. క్యాసంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ అవసరమైన వారికి తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయాలన్నారు. రోగులకు గడువు ముగిసిన మందులు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాకాలంలో అధికంగా ఉపయోగపడే జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబులాంటి వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేయాలన్నారు. గ్రామాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, వైద్యులు జోహా ముజీబ్, మీనాక్షి దేవి, సిబ్బంది పాల్గొన్నారు.

‘నిజాంసాగర్’లో ఎకో టూరిజం