
లింగంపేట కార్యదర్శికి షోకాజ్ నోటీస్
లింగంపేట: గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరించారు. శనివారం ఆయన లింగంపేటలోని రాఘవ మెడికల్ చౌరస్తా వద్ద మురికి కాల్వలను పరిశీలించారు. రోడ్డుపై మురికి నీరు, డ్రెయినేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎందుకు శుభ్రం చేయడంలేదని గ్రామ పంచాయితీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఈ ప్రాంతంలో డెంగీ సోకి కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలో 28 కేసులు నమోదు కాగా లింగంపేటలోనే 15 కేసులు నమోదయ్యాయని అధికారులు కలెక్టర్తో పేర్కొన్నారు. గతేడాది డెంగీ సోకిన ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. లింగంపేట కార్యదర్శి శ్రవణ్కుమార్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి మురళిని ఆదేశించారు. రోడ్లకిరువైపులా, మురికి కాల్వల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని ఆదేశించారు. రోజూ సానిటేషన్ చేయించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఆర్డీవో సురేందర్, డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.