● కుటుంబంలో ఒకరికి
ఉద్యోగం కల్పించాలి
● వేట్లపాలెం బాణసంచా బాధితులకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పరామర్శ
● క్షతగాత్రులకు మైరుగైన వైద్యం
అందించాలని డిమాండ్
సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం పేలుడు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం, ఐదెకరాల భూమితో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. బాణసంచా పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబుతో కలసి సామర్లకోట, వేట్లపాలెం, మేడపాడుల్లో సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, అధికారుల అవినీతి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. భారీ ఎత్తున బాణసంచా తయారు చేస్తూంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాణసంచా ఘటనలో అమాయకులు మృతి చెందడం, వారి కుటుంబాల వారు నిరాశ్రయులు కావడం దురదృష్టకరమన్నారు. బాణసంచా నిర్వాహకుల ధనాపేక్ష కారణంగానే ఇంత మంది మృతి చెందారని ఆరోపించారు. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కింది స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 50 మందితో పని చేయిస్తున్నట్లు తెలిసిందన్నారు. అనుమతికి మించి మెటీరియల్ తయారు చేస్తున్నా అడ్డుకోవాల్సిన కొందరు అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోలేదని ఆరోపించారు. పేలుడు ఘటన బాధితుల్లో అత్యధికులు దళితులు, బీసీలే ఉన్నారని తెలిపారు. గతంలో రాయవరంలోను, వేట్లపాలెంలోను ఇటువంటి ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వరుస ఘటనల్లో పెద్ద సంఖ్యలో అమాయకులు మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చెక్కులిచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఇజ్రాయిల్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉబా జాన్మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, వైఎస్సార్ సీపీ ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం, బొమ్ము బుజ్జి, ఎంఆర్పీఎస్ నాయకుడు గొడతా విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


