వణికిస్తున్న పెద్ద పులి
ఫ బీజాపురి లేఅవుట్ పరిసరాల్లో ప్రత్యక్షం
ఫ అంతకు ముందు కోలమూరు, గాడాల, గామన్ బ్రిడ్జి రోడ్డు సమీపంలో సంచారం
రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: పెద్ద పులి గడియకో రూటు మార్చుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిసరాలతో పాటు వాటికి సమీపంలో ఉన్న కోరుకొండ, సీతానగరం మండలాల గ్రామాల్లో ప్రజలు రకరకాల ప్రచారాలతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాజానగరం మండలం పాలచర్ల వైపు నుంచి ఆటోనగర్ వైపునకు పులి వచ్చిందని కొందరు తెలిపారు. 2024 ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 13 రోజుల పాటు చిరుత పులి సంచారంతో గజగజలాడిన ఈ ప్రాంత వాసులు.. ఇప్పుడు పెద్ద పులి వచ్చిందనే వార్తతో భయపడిపోతున్నారు. ఆటోనగర్ నుంచి దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు గోడ దాటుకుని, గామన్ బ్రిడ్జి రోడ్డులోని జీడిమామిడి తోటల్లోకి వెళ్లిపోయిందని కొందరు వ్యక్తులు చెప్పడంతో పాటు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం బీజాపురి లేఅవుట్ పరిసరాలకు వెళ్లిపోయిందని సమాచారం.
రెండు రోజులుగా..
తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో రెండు రోజులుగా సంచరించిన పెద్ద పులి కోలమూరు, కోరుకొండ మండలం గాడాల గ్రామాల మధ్యలో తిరిగినట్టు మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే దాని దాడిలో పశువులు చనిపోయినట్లు ఎటువంటి సమా చారమూ లేదు. కోలమూరు, గాడాల గ్రామాల వ్యవసాయ భూముల్లో పులి తిరిగినట్టు పగ్ మార్కులను జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ ఆఫీసర్ దావీదురాజు గుర్తించారు. దీంతో వారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయా ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పగ్మార్క్ ప్రాంతాల సమీపంలో డ్రోన్లు,బోనులు,ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లా అటవీశాఖ అధికారి ప్ర భాకరరావు మాట్లాడుతూ గ్రామస్తులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులను ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రకాశవంతమైన లైట్లు ఉంచాలని, జంతువును మళ్లించడానికి శబ్దాలు చేయాలన్నా రు. గాడాల నుంచి సుమారు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వణికిస్తున్న పెద్ద పులి


