
4న వికాసలో జాబ్మేళా
కాకినాడ సిటీ: కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో సోమవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ కె.లచ్చారావు శనివారం తెలిపారు. ఈ జాబ్మేళాలో జేజీఆర్ హాస్పిటల్లో పీఆర్వో, నర్సింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, వెంకీ రెసిడెన్సీ త్రీ స్టార్ హోటల్లో మెయిన్టెనెన్స్ టెక్నీషియన్, కెప్టెన్, ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, అసోసియేట్, స్టీవార్ట్స్, రాయల్ ఇన్సూరెన్స్లో టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సిస్టమ్ ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ కంపెనీలో టెలిసేల్స్ రిప్రజెంటేటివ్, వియాష్ లైఫ్ సైన్సెస్, జేకే ఫిన్నర్లో టెక్నీషియన్, ఫాక్స్కాన్ కంపెనీలో ఆపరేటర్, హోండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామో, బీటెక్, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అలాగే డీడీయూజీకేవై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా టూ వీలర్ టెక్నీషియన్, లాజిస్టిక్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సోమవారం వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరుకావాలని కోరారు.
ఉత్సాహంగా జాతీయ
జూనియర్ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 15వ జాతీయ జూనియర్ బాలికల హాకీ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. లీగ్ కమ్ నాకౌట్ దశలో జరుగుతున్న ఈ పోటీలలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉమ్మడి జట్టుతో జరిగిన మ్యాచ్లో 4–0 స్కోర్తో గోయన్స్ జట్టు, గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మిజోరాం 9–0 స్కోర్తోను, తెలంగాణతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6–1 స్కోర్తోను విజయం సాధించాయి. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్లో కేరళ 4–2 స్కోర్తో గెలుపొందింది. హిమాచల్ప్రదేశ్, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అరుణాచల్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 4–2 స్కోర్తో గెలుపొందింది. శనివారం నిర్వహించిన మ్యాచ్లను సీనియర్ పీఈటీ బంగార్రాజు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. టోర్ని కో–ఆర్డినేటర్ వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు.
నకిలీ బంగారంతో రుణం
సామర్లకోట: స్థానిక జాతీయ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఒక వ్యక్తి రూ.94 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల బ్యాంకులో బంగారు ఆభరణాల తనిఖీ చేస్తుండగా నకిలీ బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో బ్యాంకులలో బంగారం పెట్టిన వారు వారి వస్తువులను విడిపించుకున్నట్లు తెలిసింది.