రత్నగిరిపై ముగిసిన కంచి పీఠాధిపతి విజయయాత్ర
అన్నవరం: కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ విజయయాత్ర శనివారం అన్నవరంలో దిగ్విజయంగా ముగిసింది. మధ్యాహ్నం స్దానిక రైల్వేస్టేషన్ రోడ్లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దాత, శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి పీఠాధిపతి రత్నగిరి దేవస్థానానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఏడు రోజులూ ఆయన దేవస్థానంలో బస చేశారు. పంపాసత్రంలో త్రికాల పూజలు నిర్వహించారు. శనివారం అన్నవరం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చంద్రశేఖర్ అజాద్ మర్యాద పూర్వకంగా కలిసి స్వామీజీకి వీడ్కోలు పలికారు.