అదిగో.. పులి
అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.
అతిపెద్ద టైగర్ రిజర్వు..
దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్ జోన్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్ ద్వారా సేకరించిన ప్లగ్ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం
జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ
ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం
స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు
పెద్ద పులులకు పుట్టినిల్లు..
నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్–6 ఆడపులి, ఫరాహా ఎఫ్–6, తారా ఎఫ్–7, భౌరమ్మ ఎఫ్–18, ఎఫ్–26, ఎఫ్–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.
అదిగో.. పులి


