
బకాయిదారులకు ఊరట
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ
ఈ నెల 31 వరకే అవకాశం
మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను ఏటా రెండు అర్ధ వార్షికాల్లో చెల్లించవచ్చు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు, అక్టోబరు నుంచి మార్చి వరకు చెల్లించాల్సిన పన్నును ఏడాదికోసారి చెల్లించడం పరిపాటిగా మారింది. అయితే మొండి బకాయిల వసూలుకు, మున్సిపాలిటీ ఖజానాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. గతేడాది వరకు ఉన్న పన్ను బకాయిని ఏక మొత్తంలో చెల్లించే వారికి, బకాయిలపై విధించే (వడ్డీ) జరిమానాలో 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. కేవలం పది శాతం చెల్లిస్తే చాలని, ఈ అవకాశం ఈ నెల చివరి వరకు ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికే పన్ను బకాయిలను పూర్తి వడ్డీతో పాటు కలిపి చెల్లించి ఉంటే.. అలాంటి వారికి రాబోవు పన్ను చెల్లింపులో వడ్డీ రాయితీ వర్తింపచేయనున్నారు.
గద్వాలటౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీలలో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పించింది. మార్చి 2024–25 నాటికి ఆస్తిపన్ను మొత్తం బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ కానుంది. కేవలం పది శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకు ఉంటుంది. జిల్లాలో గద్వాల, అయిజ మున్సిపాలిటీలు పాతవి కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినవి. గద్వాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి వడ్డీమాఫీ ప్రకటించింది. మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను వసూళ్లు చాలా వరకు మందగించాయి. పలు రాయితీలు ఇచ్చినప్పటికి ఆశించిన స్థాయిలో పన్నులు వసూళ్లు కాలేదు. దీంతో పాత బకాయిలు వసూలు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ కొత్త ఎత్తుగడ వేసింది. వన్ టైం స్కీం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్ టైం స్కీం ద్వారా పాత బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్దమవుతున్నారు. చెల్లింపులు జరిగితే ఆయా శాఖలకు భారం తగ్గే అవకాశం ఉంది.
వన్ టైం సెటిల్మెంట్తో వంద శాతం వసూలు చేయాలని అధికారుల కసరత్తు
31 వరకు చెల్లించేవారికి మాత్రమే వర్తింపు

బకాయిదారులకు ఊరట