
దిల్ఖుష్ దోస్తానా
ఆడపిల్లల్లో స్నేహితుడిని
చూసుకుంటూ..
కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రం మున్సిపల్ కేంద్రానికి చెందిన ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారు చదువుకున్నంత కాలం తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు.
● కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు
● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు
నేడు ఫ్రెండ్షిప్ డే
లింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవా లన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది.
స్నేహితం.. సేవే అభిమతం
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు.
స్నేహితుల సంఘం!
గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు రూ.0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది.

దిల్ఖుష్ దోస్తానా

దిల్ఖుష్ దోస్తానా

దిల్ఖుష్ దోస్తానా

దిల్ఖుష్ దోస్తానా