వార్డుసభల్లో సమస్యలపై వినతులు | - | Sakshi
Sakshi News home page

వార్డుసభల్లో సమస్యలపై వినతులు

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3,4, 5,6,22, వార్డుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభలు నిర్వహించగా, ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ హాజరయ్యారు. వార్డు సభల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రెయినేజీ సమస్యలు, పచ్చదనం, ప్రజాఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు తమ సమస్యలు, తదితర వాటిని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులకు సంబంధించి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సజ్జ దుర్గాప్రసాద్‌, రామగళ్ల విజయ్‌కుమార్‌, బూడిద జ్యోతి, మంత్రి సుమలత, మిద్దెపాక భాస్కర్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు

పాటించాలి

నర్మెట: మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీడీ హౌసింగ్‌ మాతృనాయక్‌ అన్నారు. మండలకేంద్రంలో పలు దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సర్పంచ్‌ గోపగోని శ్రీధర్‌ గౌడ్‌తో కలసి గురువారం పరిశీలించారు. ఆయన వెంట ఏఈ ఎమ్డీ సొహాలీ అలీ, ఏపీఓ రమాదేవి, లబ్ధిదారులు ఉన్నారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో

నకిలీ కాల్స్‌ నమ్మొద్దు

జనగామ: ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బకాయిలు, జరిమానాల పేరుతో కొందరు వ్యక్తులు మున్సిపల్‌ అధికారులుగా చెప్పుకొని ఫోన్‌ చేసి గూగుల్‌ పే, ఫోన్‌ పే, క్యూఆర్‌ కోడ్‌లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపాలని కోరుతున్నారని, ఇలాంటి మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని మున్సిపల్‌ కమిషనర్‌ చిమ్ముల రాజశేఖర్‌ రెడ్డి సూచించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ విధమైన కాల్స్‌, సందేశాలు, లింకులు, క్యూఆర్‌ కోడ్‌లకు జనగామ మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ తరఫున ఎవరూ వ్యక్తిగత ఫోన్‌ నంబర్ల ద్వారా లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు చెల్లించమని సూచించరని, ట్రేడ్‌ లైసెన్స్‌ సంబంధిత చెల్లింపులు అధికారిక మున్సిపల్‌ పోర్టల్‌ లేదా మున్సిపల్‌ కార్యాలయం ద్వారా మాత్రమే నిర్వహించాలని తెలిపారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే పోలీసు శాఖ, సైబర్‌ క్రైం హె ల్ప్‌లైన్‌–1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

నీళ్లు పారే నేలలో

నెత్తురు పారించే కుట్ర

హన్మకొండ చౌరస్తా: నీళ్లు పారే తెలంగాణలో నెత్తురు పారించేలా కుట్రలు సాగుతున్నాయని ఎమ్మెల్సీ, తెలంగాణ వికాస సమితి గౌరవ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌ హాల్‌ (అనిశెట్టి రజిత ప్రాంగ ణం)లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘చంద్ర బాబుకు పాతబస్తీ వద్దు.. కానీ, హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్‌ కావాలి’ అని విమర్శించారు. ఎవరో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎలా ఉంటుంది? వరంగల్‌ కోటలో రాళ్లు ఎత్తింది మా తాతలు, ముత్తాతలని అన్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో కార్యదర్శి విజయ్‌, భిక్షపతినాయక్‌, నాగిల్ల రామశాస్త్రి, కవులు వీఆర్‌ విద్యార్థి, రామా చంద్రమౌళి, శివకుమార్‌, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు, మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement