జనగామ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా వైద్యులు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జనగామ చంపక్హిల్స్లోని మాతా శిశు ఆస్పత్రిని (ఎంసీహెచ్) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి, సేవలను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. ఆస్పత్రిలోని ప్రతీ వార్డును సందర్శించి, అక్కడ అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలను స్వయంగా పరిశీలించి, గర్భిణులకు చేయించే వ్యాయామం సరిగా నిర్వహించాలన్నారు. వైద్యులు బాధ్యతగా పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.
రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదాం
రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో మంగళవారం చంపక్హిల్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని లెక్చర్ గ్యాలరీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమమని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ అన్వర్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, రాజలింగం, నాగమణి, కోటాచలం, అన్వర్ పాల్గొన్నారు.
భూ భారతి పెండింగ్ దరఖాస్తులను
త్వరగా పరిష్కరించాలి
భూ భారతిలో వివిధ మాడ్యూల్స్లోని పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎంసీహెచ్ ఆకస్మిక తనిఖీ


