అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్తో
విద్యార్థులకు ప్రయోజనం
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతిభ ఉండి భవిష్యత్లో గొప్ప అవకాశాలు అందుకుని భవిష్యత్లో ఉన్నతంగా స్థిరపడడానికి అజీమ్ ప్రేమజీ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా ఇస్తోంది. కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుకునే వారికి ఈ అవకాశం లభిస్తోంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. శ్రీనివాసరావు చొరవతో కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ప్రఖ్యాతిగాంచిన అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. జె. శ్రీజ, ధనలక్ష్మి, ఐ.దివ్య, బి. మమత, బి. కీర్తి, జి.ప్రవళికకు మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేల చొప్పున వారి అకౌంట్లో నగదు జమ అయ్యింది. కళాశాల నుంచి మొత్తం 36 మంది విద్యార్థినులు అప్లై చేయగా ఆరుగురు ఎంపికయ్యారు. ఇందులో మొదటి సంవత్సరానికి గాను రూ.30 వేలు వరకు జమ అయ్యాయి. వీరికి సెకండియర్, ఫైనల్ ఇయర్లో కూడా ఏడాదికి రూ.30వేలు జమకానున్నాయి. మిగతా విద్యార్థులు కూడా త్వరలో రెండో విడత స్కాలర్షిప్ లభించవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా మూడేళ్లకు రూ.90వేలు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ స్కాలర్షిప్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం చేసిన ఎం.శ్రీనివాస్, టి.కరుణాకర్తో పాటు మిగతా అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మాత్రమే అవకాశం
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుగురు విద్యార్థినుల ఎంపిక
ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు


