స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం శివారు సింగారపు ఏనె గుట్ట నుంచి మట్టిని తరలించవద్దంటూ డిమాండ్ చేస్తూ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. రైతులు మందపురం అనీల్, మంద చంద్రమౌళి, మునిగెల నర్సింహులు, ఎండీ యాకూబ్పాషా, సట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సింగారపు ఏనె క్వారీ నుంచి అక్రమంగా ఇష్టారాజ్యంగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఓవర్లోడ్తో వాహనాలు నడుస్తుండగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్డు వెంట పంటలపై విపరీతంగా దుమ్ము, ధూళి పడి పంటలు నష్టపోతున్నామన్నారు. మట్టిని తరలిస్తున్న రోడ్డులో ఉన్న కుంట మత్తడి ధ్వంసమైందని, దీంతో పంటపొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని, మట్టి రవాణాను అడ్డుకునేలా కుంట మత్తడి ఉన్న వద్ద రోడ్డుపై పోసిన మట్టిని తొలగించి నిరసన చేపట్టినట్లు తెలిపారు.
పరిశీలించిన ట్రెయినీ ఐపీఎస్
మట్టిని తరలిస్తున్న రోడ్డుపై టిప్పర్లు వెళ్లకుండా రోడ్డును ధ్వంసం చేశారని క్వారీ నిర్వాహకులు అందించిన ఫిర్యాదు మేరకు ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు అక్కడకు చేరుకుని రైతులతో, క్వారీ నిర్వాహకులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యను విన్నవించగా రోడ్డును ధ్వంసం చేయడం సరికాదని, మట్టి తరలింపు విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్, నాయకులు ఎన్.అజయ్రెడ్డి, లింగనబోయిన శ్రీను, పల్లె రవీందర్, యాదగిరి, మైబుపాషా, రవి, షాబుద్దీన్, సోమయ్య పాల్గొన్నారు.


