
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
స్నేహితుల సంఘం!
గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.
హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది.
సేవే అభిమతం
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు.
కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రంలోని ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎఫ్డీ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి చదువుకున్నంత కాలం చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు.
కేసముద్రం: శివాని ఫీజు కడుతున్న బాల్యమిత్రులు
జనగామ: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు ఉత్తర్వులకు విరుద్ధంగా విద్యార్థి, టీచర్ రేషియోను పట్టించుకోకుండా అధికారులు సర్దుబాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటులో పలుకుబడి కలిగిన వారు పని చేస్తున్న స్కూల్స్కే పెద్దపీట వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లలు తక్కువగా ఉండి, అదనంగా పని చేస్తున్న టీచర్లను, విద్యార్థుల సంఖ్య ఎక్కువ, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న చోటకు సర్దుబాటు చేయాలి. కానీ జిల్లాలో పైరవీలు చేసిన వారికే ప్రాముఖ్యం ఇచ్చారని చెప్పుకుంటున్నారు. శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
72 మంది ఎస్జీటీలు, 32 మంది ఎస్ఏలు..
జిల్లాలోని 11 మండలాల పరిధిలో 109 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 72 మంది ఎస్జీటీలు, 32 మంది స్కూల్ అసిస్టెంట్లు, 5 లాంగ్వేజ్ పండిట్ లను మరో పాఠశాలకు సర్దుబాటు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రాథమిక పాఠశాలలో 10 మందిలోపు విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 లోపు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలనే నిబంధన ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యార్థులు తక్కువ ఎక్కువతో సంబంధం లేకుండా సర్దుబాటు విషయంలో కేవలం పైరవీలకు మాత్రమే చోటు కల్పించారని మాట్లాడుకుంటున్నారు. జనగామ మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మరొక టీచర్ను కేటాయించలేదు. అదే కొంత మంది ప్రముఖులుగా చెప్పుకునే టీచర్ల విషయంలో సర్దుబాటులో ప్రియార్టీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ 40 నుంచి 45 మంది విద్యార్థులకు 3 టీచర్లు ఉండగా, సర్దుబాటులో మరొకరిని కేటాయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా నర్మెట మండల పరిధిలో పలు స్కూల్స్ల్లో 45 నుంచి 50 మంది విద్యార్థులకు 3 ఎస్జీటీలు ఉండగా, ఒకరిని తొలగించి అదే మండలంలో బాధ్యులుగా చెప్పుకునే వారి పాఠశాలలో 40 నుంచి 45 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు పని చేస్తున్నా, మరొకరిని కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బచ్చన్నపేట మండలంలో నేతలు పని చేస్తున్న స్కూల్స్ల్లో విద్యార్థుల సంఖ్య 45 నుంచి 50 మందికి నలుగురు లేక ఐదుగురు పని చేస్తున్నా.. అక్కడ నుంచి ఒక్కరిని కూడా తొలగించలేదు. ఇదే మండలంలో బడిబాట, రెగ్యులర్గా పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి, మరో టీచర్ అవసరమున్నప్పటికీ, ఈ జాబితాలో చోటు కల్పించలేదు. సర్దుబాటు జాబితాపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని మేధావి వర్గం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం నిరుపేద పిల్లల అభ్యున్నతికి సర్కారు విద్యను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతుంటే, సర్దుబాటు సమయంలో విద్యార్థుల భవిష్యత్కు ఆటంకంగా మారే పరిస్థితి ఉందని మాట్లాడుకోవడం గమనార్హం. ఐఏఎస్ అధికారి జిల్లా విద్యా శాఖ అధికారిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత, సర్దుబాటులో సమన్యాయం జరగలేదనే ప్రచారంలో నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావాలని, సర్కారు బడులను గౌరవించే ప్రతిఒక్కరు కోరుతున్నారు.
మండలాల వారీగా ఉపాధ్యాయుల సర్దుబాటు
బచ్చన్నపేట మండలంలో 8, చిల్పూరు 9, దేవరుప్పుల 10, స్టేషన్ఘన్పూర్ 8, జనగామ 20, నర్మెట 7, కొడకండ్ల 5, లింగాలఘణపురం 6, పాలకుర్తి 13, రఘునాథపల్లి 15, జఫర్గఢ్లో 8 మందిని సర్దుబాటు చేశారు.

బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్

బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్

బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్