జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని సాయిరాంనగర్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. సాయిరాంనగర్కు చెందిన శ్రీకాంత్ సాయిబాబా బైపాస్రోడ్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తాడు. బుధవారం ఉదయం టిఫిన్ సెంటర్కు వెళ్తున్నానని బయటికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అతని భార్య జ్యోతిర్మయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఆటో చోరీ నిందితుడి అరెస్ట్
కోరుట్ల రూరల్: పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశం నుంచి ఈ నెల 15న ప్యాసింజర్ ఆటోను చోరీ చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 15న మొహమ్మద్ అజర్ తన ప్యాసింజర్ ఆటోను రైల్వే స్టేషన్లో పెట్టి కరీంనగర్ వెళ్లాడు. 16న వచ్చే సరికి ఆటో కనిపించలేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నర్సింగి గ్రామానికి చెందిన ఖాలిద్ బిన్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆటో దొంగిలించి అల్లమయ్య గుట్ట వద్ద దాచిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్సై పేర్కొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
కోరుట్ల రూరల్: మండలంలోని అయిలాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని బుధవారం సాయంత్రం పట్టుకున్నామని ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం అయిలాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై తన బృందంతో దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులను పట్టుకుని, రూ.12280 నగదు, 6 సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నాట్టు తెలిపారు.
పెచ్చులూడిన ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెచ్చులూ ఊడిపడ్డాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు, ఇతురులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం
వెల్గటూర్: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడ్డి ఇందిర (43) భర్త ఉపాధికోసం ముంబాయి వెళ్లాడు. గ్రామంలో కొంత వరకు అప్పు చేశారు. కుటుంబ ఆదాయం కన్నా అప్పులు పెరిగిపోయి, వాటిని తీర్చే మార్గం తెలియక రోజూ బాధపడుతుండేది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ నిద్ర లేవక ముందు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి సోదరుడు బైరి వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.


