
సర్కార్ రీచ్లో ఇసుక అక్రమ రవాణా
● చలానా కట్టి తీసుకెళ్లేవారే లేరట..! ● అక్రమ రవాణాదారులకు మాత్రం అడ్డా.. ● రెవెన్యూ తీరుపై సందేహాలు
కోరుట్ల: నాలుగు గ్రామాల నదీ పరివాహాక ప్రాంతం.. సుమారు 10 కిలోమీటర్ల ఏరియా.. పెద్ద ఎత్తున నాణ్యమైన ఇసుక నిల్వలు. వాగులో 10 ఫీట్ల లోతు తవ్వినా ఇసుక తగ్గని వైనం. ఇదీ.. కోరుట్ల–కథలాపూర్ మండలాల సరిహద్దుల్లోని నాగులపేట–సిరికొండ–తక్కల్లపల్లి గ్రామాల వాగు తీర ప్రాంత పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు పేరుకుపోయిఉన్నాయి. ఈ ఏరియాను ప్రభుత్వ ఇసుక రీచ్గా రెవెన్యూ అఽధికారులు గుర్తించారు. అదేం చోద్యమోగానీ ఈ రీచ్ నుంచి ప్రభుత్వానికి చలానా చెల్లించి ఇసుక తీసుకెళ్లేవారే లేరని రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే అదే ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణాదారులు మాత్రం దర్జాగా రవాణా చేయడమే వింత.
చలానా కట్టేవారే లేరట..
కోరుట్ల మండలం నాగులపేట, కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి, సిరికొండ, బొమ్మెన గ్రామాల సరిహద్దుల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర నది పరీవాహక ప్రాంతం ఉంది. ఈ పరీవాహక ప్రాంతంలో కిలోమీటర్ల మేర ఇసుక పేరుకుపోయింది. ఏటా వర్షాలు కురిసి తగ్గిన అనంతరం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక మేట వేస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించిన రెవెన్యూ అఽధికారులు ఇక్కడ ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే ఎంతో కొంత ఆదాయం వస్తుందని భావించారు. సుమారు తొమ్మిది నెలల క్రితం నాగులపేట–కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులోని వాగు ఏరియాను ఇసుక రీచ్గా ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి సర్కార్కు చలానాలు కట్టి ఇసుక తీసుకెళ్లేవారు అంతంత మాత్రంగానే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఇసుక నాణ్యత సరిగా లేకపోవడం ఓ కారణమని అధికారులు చెబుతుండగా.. రవాణాకు ఈ ప్రాంతం నుంచి సరైన రహదారులు లేవన్న వాదనలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉందిగానీ ఇక్కడి నుంచి మూడు జిల్లాలకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా కావడమే విడ్డూరంగా ఉంది.
మూడు జిల్లాలకు అక్రమ రవాణా..
ఈ రీచ్లో సర్కార్కు చలానా కట్టేవారే దిక్కు లేకపోగా మూడు జిల్లాలకు మాత్రం అక్రమంగా ఇసుక రవాణా అవుతోంది. కోరుట్ల–కథలాపూర్ సరిహద్దుల్లో ఉన్న ఈ ఇసుక రీచ్ నుంచి కథలాపూర్ వరద కాలువ పక్క నుంచి.. పెగ్గెర్ల, ఇబ్రహీంపట్నం బండలింగాపూర్ శివారు మీదుగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, ఆర్మూర్ ఏరియాలకు ఇసుక టిప్పర్లలో అక్రమంగా తరలుతోంది. కథలాపూర్ మండలం బొమ్మన–తక్కళ్లపల్లి గ్రామాల పరిధిలోని వాగు నుంచి కోరుట్ల మండలం మోహన్రావుపేట మీదుగా జగిత్యాల, కథలాపూర్ వయా సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మీదుగా వేములవాడ ఏరియాకు తరలుతోంది. ఇసుక అక్రమ రవాణాదారులు పెద్ద మొత్తంలో టిప్పర్లతో తరలిస్తున్నా.. రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం వెనక తిరకాసు ఏమిటన్న అంశం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అఽధికార యంత్రాంగం నిక్కచ్చిగా వ్యవహరిస్తే సర్కార్ రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగిపోయి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించి సర్కార్ ఖజానాకు లబ్ధి చేకూరేలా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
చలానా ఎవరూ కట్టడం లేదు
నాగులపేట–తక్కల్లపల్లి–సిరికొండ సరిహద్దుల్లో అధికారికంగా ఇసుక రీచ్ ఉన్నప్పటికీ ఎవరూ అక్కడి నుంచి చలానా కట్టి ఇసుక తీసుకెళ్లడం లేదు. ఇసుక అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలేదు.
– వినోద్, తహసీల్దార్, కథలాపూర్