
భారమవుతున్న బంధాలు
● ప్రజావాణికి పండుటాకులు ● బుక్కెడు బువ్వ.. కాసింత ఆదరణ కోసం ● పిల్లలు కనికరించడం లేదంటూ కలెక్టర్కు వేడుకోలు
● ఈమె జగిత్యాల పట్టణానికి చెందిన చెట్టె మల్లు. భర్త చనిపోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. ఆస్తిని లాక్కున్న కుమారులు తనకు అన్నం పెట్టడం లేదంటూ ప్రజావాణి గడపతొక్కింది. తనకు ఆస్తి తిరిగి ఇప్పించి అనాథశరణాలయంలో చోటు కల్పిస్తే.. ఆస్తినంతా ప్రభుత్వానికి రాసిస్తానంటూ ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకుంది. ఈమెకు ముగ్గురు కొడుకులు. ఒక కూతురు ఉన్నారు. తన ఆస్తి మొత్తం పట్టా చేసుకుని తన బాగోగులు చూడటం లేదని, కనీసం అన్నంపెట్టి మందులు ఇప్పిస్తలేరని ఆవేదనభరితంగా తెలిపింది. తన కొడుకులు రాయించుకున్న ఆస్తి తన ఇప్పించాలని వేడుకుంది.
జగిత్యాలటౌన్: కని.. అల్లారుముద్దుగా పెంచి.. విద్యాబుద్ధులు నేర్పి.. వారే సరస్వమని భావించిన తల్లిదండ్రులు.. వారు ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడిన అనంతరం వారి బాగోగులు మర్చిపోతున్నారు. దీంతో వృద్ధులు చివరి మజిలీలో తమకు న్యాయం చేయాలని ‘ప్రజావాణి’ తలుపు తడుతున్నారు. ఇది మాయమైపోతున్న మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. అన్నీ తామై పెంచామని, వారిని వృద్ధిలోకి తెచ్చామని, అలాంటి తమకు జీవిత చరమాంకంలో కనీసం అన్నం పెట్టి ఆశ్రయం కల్పించడం లేదంటూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్నమో రామచంద్రా అంటూ కలెక్టర్కు గోడు వెల్లబోసుకుంటున్నారు. తమ ఆస్తిని అనుభవిస్తూ.. తమను పట్టించుకోకుండా.. బుక్కెడు బువ్వ పెట్టకుండా వేధిస్తున్న తమ వారసుల నుంచి ఆస్తిని తిరిగి ఇప్పించాలని, తమ బాగోగులు చూసే ఏర్పాటు చేస్తే ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తామంటూ విన్నవించుకుంటున్నారు. అయితే ప్రజావాణికి ఫిర్యాదు చేస్తున్న వారికి జరుగుతున్న న్యాయం అంతంత మాత్రమే.

భారమవుతున్న బంధాలు