
సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
ధర్మపురి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి 699 మందికి ప్రొసీడింగ్స్ అందించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు 45 రోజుల్లోగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, లేకుంటే రద్దు చేసి అర్హులకు ఇస్తామని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి ముగ్గు పోసి ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు.
ధర్మపురిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ధర్మపురి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి అడ్లూరి అన్నారు. శ్రీలక్ష్మినరసింహ ఫంక్షన్ హాల్లో అభివృద్ధి పనులపై శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్ల భవనాలు, సివిల్ సప్లై, వ్యవసాయం, వసతి గృహాల శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పనుల ప్రగతికి కార్యాచరణ రూపొందించాలన్నారు.